Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోరుట్లలో విద్యాసాగర్రావును అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ-నారాయణఖేడ్/ మల్లాపూర్
ఇన్ని రోజులు గ్రామాల వైపు కన్నెత్తి చూడని టీఆర్ఎస్ అభ్యర్థులు.. ఇప్పుడు ఎన్ని కల ప్రచారంలో గ్రామాలవైపు పరుగులు పెడుతుండగా, ప్రజాసమస్యలపై ఎక్కడి కక్కడ జనం నిలదీస్తూ అడ్డుకుంటున్నారు. దీన్ని తట్టుకోలేకపోతున్న అభ్యర్థుల అనుచ రులు కొన్నిచోట్ల వాగ్వాదం, దూషణలకు దిగుతున్నారు. సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పిప్రి గ్రామానికి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులను నీటి, రోడ్డు సమస్యలపై గిరిజనులు అడిగారు. ''ఓట్లప్పుడే మేం గుర్తుకొస్తం. గతంలో మా సమస్యలు తీరుస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకున్నరు. మల్ల ఊరుకు రాలే. ఊళ్లె నీళ్లకు ఇబ్బంది ఉంది. రోడ్లు సరిగా లెవ్వు. గిప్పుడు మల్ల ఎలచ్చన్లొచ్చినయని వచ్చిం డ్రు'' అని గిరిజన యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రచార వాహనంపై ఉన్న ఓ కార్యకర్త సదరు యువకులను తిట్టాడు. దీంతో గ్రామస్తులు వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో భూపాల్రెడ్డి కలుగ జేసుకుని అనుచరులను వారించారు. ఆయన మాట్లా డుతూ.. ఇతర పార్టీల వాళ్లు కొందరు కావాలనే తన ప్రచా రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇది సబబు కాదని అన్నారు. ఏమైనా సమస్యలుంటే తనతో మాట్లాడాలన్నారు. పిప్రి గ్రామ వెనుకబాటుకు గతంలో దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కారణమన్నారు. మూడేండ్లలో తాను ఎంత చేశానో ప్రజలకు తెలుసన్నారు. త్వరలోనే గ్రామంలో ఇంటింటికీ తాగునీరు అందుతుందని చెప్పారు.
ఎస్ఆర్ఎస్పీ నీటి కోసం..
జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్రావును వారం రోజుల కిందట మెట్పల్లి మండలంలో రైతులు అడ్డుకున్నారు. మంగళవారం మల్లాపూర్ మండలంలోనూ రైతులు నిలదీశారు. ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తూ ఎస్ఆర్ఎస్పీ నీటి తరలింపును వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ముత్యంపేట గ్రామంలో ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎస్పీ డిస్ట్రిబ్యూటర్ మాజీ చైర్మన్ వాకిటి సత్యంరెడ్డి, రైతులు మాట్లాడుతూ.. ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్మానేరుకు నీటికి అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి తరలింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రానున్న రబీలో పంటలకు నీరు లేక ఆయకట్టు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట చక్కర కర్మాగారాన్ని వంద రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. మెట్పల్లి సీఐ రవికుమార్, ఎస్ఐ శంకర్రావు రైతులతో మాట్లాడి శాంతింపజేసేందుకు యత్నించారు. అనంతరం విద్యాసాగర్రావు మాట్లాడుతూ.. ఎస్ఆర్ఎస్పీలో రబీకి సరిపడా నీరు ఉందని, రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. చక్కర కర్మాగారాన్ని సహకార పద్ధతిలో నడిపేందుకు ముందుంటానని చెప్పారు.