Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుణాత్మక మార్పు కోసం దేశ రాజకీయాల్లో..
- దేశానికి తెలంగాణ దిక్సూచి
- రైతు ఎజెండాతో ముందుకు
- ప్రజల ఏజెంట్లం.. గులాంగిరీ చేయం
- ఆరునెలల్లో గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం
- ఆరోగ్య తెలంగాణ నిర్మిస్తాం
- బాబు ఇక్కడికొచ్చి గిప్టు ఇచ్చాడు.. నేను విజయవాడకెళ్లి ఇస్తా : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తెలంగాణలో విజయం సాధించాం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మా ర్పు కోసం కీలకపాత్ర పోషించబోతున్నాం.కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ నిర్మాణం కోసం దేశ ప్రజలందర్నీ ఏకం చేస్తాం. కలిసొచ్చే శక్తులన్నింటినీ కలుపుకుని ముందుకు పోతాం' అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లా డారు. జాతీయ రాజకీయాలకు తెలంగాణ దిక్సూచి అని, దేశమంతటా బీజేపీ, కాంగ్రేసేతర పార్టీల పాలన రావాలని ఆకాంక్షించారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందు బాటులో ఉన్నాయని, ప్రతిఏటా 30వేల టీఎంసీలకు మించి ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అందించలేకపోయాయని విమర్శించారు. ఆ నీటి వనరులను పూర్తిగా అందుబాటు లోకి తెస్తే భారత వ్యవసాయ రంగాన్ని ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దొచ్చని, అన్నమో రామచంద్ర అనే స్థితిలో ఉన్న 15కోట్ల రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. ముస్లిం, మిగతా అన్ని మైనార్టీలను ఏకం చేసేందుకు అస దుద్దీన్తో కలిసి ప్రణాళిక రూపొందించామన్నారు. 'ప్రస్తు తం మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ ప్రత్యా మ్నాయం లేదు. కాంగ్రెస్ కాకపోతే బీజేపీ..బీజేపీ కాకపోతే కాంగ్రెస్ అన్నట్టు అక్కడ పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. బీజేపేతర, కాంగ్రెసేతర శక్తులు బలపడాలి' అని ఆకాక్షించారు. 'పార్టీలు ముఖ్యం కాదు. తెలంగాణలో గెలిచినం. దేశ ప్రజలను ఏకం చేసే ఎజెండాతో ముందుకు పోతాం. నేను ఇలా అంటుంటే కొందరు హేళనగా మాట్లా డుతున్నరు. గులాబీ జెండా మొదట ఎగరవేసినప్పుడు ఈయనతోని అయితదా? చస్తదా? అని కొందరన్నరు. మొ దట చిన్నదానితోనే ప్రారంభం కావచ్చు. ఆ తర్వాత ఉప్పెనలా మారాం. రాష్ట్రం కోసం పోరాడాం. తెలంగాణ రాలేదా? ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించలేదా? అన్నీ సాధ్యమే' అని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారత్నాల పేరుతో తొమ్మిదిన్నర లక్ష కోట్లు, ఆర్బీఐ దగ్గర 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయల నిల్వలు మూలుగుతున్నాయని, దేశ అవసరాల కోసం నాలుగైదు లక్షల నిల్వ ఉంచి మిగతా రూ.16 లేదా 17లక్షల కోట్లతో దేశాన్ని అద్భుతంగా అభి వృద్ధి చేయవచ్చునని వివరించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోడీ సర్కారు..సర్జికల్ స్ట్రైక్, రామ మందిరం ఎత్తుగడతో జనంలో సెంటిమెంట్ రెచ్చగొడుతు న్నారని, ఇది సరైన ధోరణి కాదని విమర్శించారు. దేశ ప్రజల బాగు కోసం పార్టీలు పాటుపడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తోని సమస్యను పరిష్కరించడం దృష్టి పెట్టాలని గానీ రాష్ట్రాలపై పెత్తనం ఏందని ప్రశ్నించారు. రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనాన్ని సహించబోమన్నారు. 'ఇక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెట్టుకుంటామంటే 50 శాతం మించొద్దని సుప్రీం కోర్టు చెప్పడమేంది? అవసరమైతే కేంద్రం ఓ చట్టం చేసి దీనిని సవరించాలి. ఆనాడు బీసీలు, దళితులు, మైనార్టీలు అడగలేదు. ఈనాడు వారిలో చైతన్యం వచ్చింది. రిజర్వేషన్లు అడుగుతున్నరు ఇవ్వొద్దా? ఇవ్వొద్దనడానికి మీరెవరు? స్థానిక రిజర్వేషన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి. మధ్యలో ఈ జోక్యాలెందుకు' అంటూ వ్యాఖ్యానించారు. కోతల్లేకుండా కరెంటు అందిస్తుంటే నిజామాబాద్లో మోడీ మాట్లాడుతూ తెలంగాణలో కరెంటు సమస్య ఉందని ప్రధాని స్థాయిలో వ్యాఖ్యానించడం దారుణమన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇక్కడకు వచ్చి నగరాల పేర్లను మారుస్తమని చెప్పాడని, అభివృద్ధి అంటే పేరు మార్చడం కాదని విమర్శించారు.
రైతు ఎజెండాతో ముందుకెళ్తాం
టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం...కూటమి గెలిస్తే శనేశ్వరం అవుతుందని చెప్పిన మాటను నమ్మి తమను ప్రజలు ఆదరించారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం, డిండి, సీతారామ తదితర ప్రాజెక్టులను వీలైనంత త్వరలో పూర్తిచేసి కోటిఎకరాలకు సాగు నీరు అందిస్తామని నొక్కి చెప్పారు. 'రైతులను ధనికులను చేయడమే మా ధ్యేయం. రైతులకు ఏ బాధా లేకుండా చూస్తాం. అందులో భాగంగా ఇప్పటికే వ్యవసాయ సంబంధ పరికరాలు, తదితరాల కొనుగోలు ఉండే పలు పన్నులను రద్దుచేశాం. ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. రుణమాఫీ చేశాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా బాధ్యతగా తీసుకుని 85 శాతం పట్టాదారుపాసు పుస్తకాలను రైతులకు అందజేశాం. రైతులు ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. మిగతా 15 శాతం రైతులకు కూడా త్వరలోనే పట్టాలు అందజేస్తాం. ఎవరి భూమి ఎక్కడుందో పూర్తి వివరాలతో ఆన్లైన్లో పొందుపరుస్తాం' అని భరోసానిచ్చారు. రైతుల మేలు కోసం స్వామినాథన్ సిఫార్సుల అమలును కూడా పరిశీలిస్తామన్నారు. సీఎం ఎక్కడున్నాడన్నది సమస్యకాదని, ప్రజలకు మంచి చేశాడా? లేదా? అన్నదని ముఖ్యమని అన్నారు. బీడీ, చేనేత, కల్లు, తదితర చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు ఆధునిక పరికరాలను ఇచ్చి వారిలోని నైపుణ్యతను మరింత పెంచుతామని హామీనిచ్చారు. నిరుద్యోగ సమస్య దేశమంతటా ఉందని, అయినా, యువతకు ఎక్కువ ఉద్యోగవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీలైనంత త్వరగా ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీచేస్తామని ప్రకటించారు. ప్రభుత్వేతర సంస్థల్లో కూడా విరివిగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. దేశానికే ఆదర్శంగా సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ నిర్మించే దిశగా వెళ్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ ఇప్పటికే కంటి పరీక్షలు అయిపోయాయని, ఇప్పుడు వరుసగా చెవి, ముక్కు, గొంతు.. డెంటల్...హైలెవల్ పాథలాజికల్ డాక్టర్లు బృందాలు గ్రామాల్లో పర్యటించి పరీక్షలు చేస్తాయని ప్రకటించారు. ప్రతి ఒక్క వ్యక్తి హెల్త్ ప్రొఫెల్ ప్రభుత్వం దగ్గర ఉంటుందని, దీని ద్వారా ఎవరికి ఏ సమస్య ఉందో పరిష్కరిస్తే అందరూ మంచిగా పనిచేసి అద్భుత తెలంగాణ ను నిర్మిస్తారని అన్నారు. మైనార్టీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించామని, ఇక నుంచి కూడా అలాగే చేస్తామని తెలిపారు. దళితులు, గిరిజ నుల్లో దరిద్రం రాచపుండులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలోని పేదరికాన్ని పారదోలేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఆపద్ధర్మ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఓ కమిటీ వేసిన విష యాన్ని గుర్తు చేశారు. పేదరికానికి కులం, మతం లేదని, అగ్రకులాల్లోనూ పేదలు ఉన్నారని వారికి చేయూతనిచ్చేం దుకు కూడా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని సమస్య ల పరిష్కార ఇతివృత్తంగా తమ ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని నొక్కి చెప్పారు. మేం అనుకున్నట్టు 100 స్థానాలు రాలేదని, మిగతా స్థానాల్లోనూ మా అభ్యర్థుల, స్థానిక నాయకుల తప్పిదాల వల్లే ఓడిపోయారని ఖమ్మం జిల్లాను ఉదహరణగా చూపుతూ వివరించారు.
బాబు నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. నేను విజయవాడకెళ్లి ఇస్తా
'ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసి గిఫ్ట్ ఇచ్చి వెళ్లాడు. నేను విజయవాడకెళ్లి ఆయనకు కూడా గిఫ్టు ఇవ్వాలి కదా! అరె అంతెందుకు మన ఇంట్ల బర్త్డే దావత్ జరిగితే వచ్చినోళ్లు గిఫ్ట్ ఇస్తరు. మళ్ల మనం వాళ్ల ఇంట్ల దావత్కు పోతే గిఫ్ట్ తీసుకునిపోయి ఇవ్వాల్నా వద్దా! కచ్చితంగా బాబుకు గిఫ్ట్ ఇస్తా' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఇన్నిరోజులు మోడీని పొగిడాడని, నిటిఆయోగ్ సమావేశం లోనైతే ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన తొలి వ్యక్తి మోడీ అని, ఆయనకు రాష్ట్రాల సమస్యలు తెలు స్తాయని వ్యాఖ్యానిస్తే మిగతా సీఎంలంతా నవ్వారని...అదీ ఆయన రాజకీయ పరిజ్ఞానం అని విమర్శించారు. బీజేపీతో చెడటం తో నేడు ఫ్రంట్ పల్లవి ఎత్తుకున్నాడన్నాడని, ఆయ న్ను నమ్మేస్థితిలో ఎవ్వరూ లేరని అన్నారు. ఏపీలో మీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. తెలుగు ప్రజల కోసం బాబు ఇక్కడ ప్రచారం చేసినప్పుడు నేను కూడా అక్కడ చేస్తా గదా అని సమాధానం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీచేస్తుందా అని అడగ్గా... ఏమో అని నవ్వుతూ దాటవేశారు.ప్రజా విజయం.. అందరికీ కృతజ్ఞతలు
ఈరోజు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి లభించినటు వంటి విజయం పూర్తిగా ప్రజల విజయం. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు కులాలకు, మతాలకు అతీతంగా సబ్బండ వర్గాల వారు ఆదరించారు. వారందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్న. మేం ప్రజలకు ఏజెంట్లం. ఎవ్వరికీ గులాంగిరీ చేయం. ప్రజల కోసమే పనిచేస్తాం. ఎన్నికల్లో నిద్రహారాలను మాని అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసిన టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, మేధావులకు పేరుపేరునా వందనాలు. ఈ విజయంతో పొంగిపోవా ల్సిన అవసరం లేదు. మనకు అణుకువ, వినయం, విధేయత అవసరం. ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలి తప్ప సమయాన్ని వృథా చేయవద్దు. నెగిటివ్ పవర్ వైపు చూడొద్దు. పాజిటివ్వైపు ఆలోచించాలి. ఈ విజయం వల్ల ఎంత గర్వంగా ఉందో బాధ్యత కూడా అం తే బలంగా ఉంది' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్క వివాదం లేకుండా రాష్ట్రంలో ఎన్నికలు జరగడం దేశానికే ఆదర్శమన్నారు. డబ్బుల ప్రవాహం విచ్చలవిడిగా జరిగిందని, దానిని ఎవ్వరూ అరికట్టలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఈసీకి, సీఈఓకు, సిబ్బందికి, జర్నలిస్టులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.