Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూ ఢిల్లీ బ్యూరో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచేసరికి రెండు తెలుగు రాష్ట్రాలకు సుమారు రూ. 17 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, గ్రాంట్ల రూపంలో విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అందులో ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 14 వేల కోట్లకు పైగా విడుదల చేయగా, తెలంగాణ ప్రభుత్వానికి రూ. 1800 కోట్లను కేటాయించినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి గంగారామ్ బుధవారం సభకు నివేదించారు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పటివరకు కేటాయించిన నిధులెంతా? అందులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ కింద ఎన్ని నిధులు విడుదల చేశారు? కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన నిధులు పూర్తిమేర ఇవ్వడంలో ఉన్నటువంటి ఇబ్బందులెంటని ఏపీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామ్చందర్రావు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ బుధవారం లేఖ ద్వారా స్పందించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్కు 2015-16 నుంచి 2019-19 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం పలు రాయితీల రూపంలో నిధులు కేటాయించినట్టు తెలిపారు. 2018-19 సంవత్సరానికి గాను ఎక్స్టర్న్లీ ఏడెడ్ ప్రాజెక్టు(ఈఏపీ)లకు రూ. 15.81 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తర ఆంధ్రాలోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 2500 కోట్లు ఇచ్చామని సమాధానమిచ్చారు. రాజధాని అభివృద్ధికి రూ. 1050 కోట్లు గ్రాంట్లుగా ఇచ్చినట్టు వివరించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం తరపున ఇప్పటివరకు రూ. 14,294.20 కోట్లు విడుదలైనట్టు వెల్లడించారు. మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా సభకు మంతి హామీనిచ్చారు. పైన పేర్కొన్న వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రానికి రూ 1,800 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ఇవికాక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలిపిన విధంగా కేంద్ర విద్యాసంస్థలను నెలకొల్పామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.