Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు చేపట్టండి : హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరింది. బుధవారం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్వీ భట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరించాలని తెలంగాణ రైతు రుణ విముక్తి కమిషన్ను ఆదేశించారు. రైతు సమస్యలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలనీ, పరిష్కారం కోసం స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరారు. మూడు నెలలకోసారి సమస్యలు పరిష్కరించాలనీ ఎన్ని దరఖాస్తులొచ్చాయో, ఎన్ని పరిష్కరించారనే దానిపై మూడు నెలలకోసారి నివేదిక సమర్పించాలనీ తెలంగాణ రైతు రుణ విముక్తి కమిషన్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించారు. సామాజిక కార్యకర్తలు డి నరసింహారెడ్డి, కె శివరాంరెడ్డి, రామయ్య యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది ఎస్ శరత్కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిషన్కు చైర్మెన్గా నాగుర్ల వెంకటేశ్వర్లు, సభ్యులుగా పాకాల శ్రీహరిరావు, కె లక్ష్మారెడ్డి ఉన్నారనీ చెప్పారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఏటా ఎకరాకు రూ.8 వేలు చెల్లిస్తోందని వివరించారు. భవిష్యత్తులో ఎకరాకు చెల్లించే సొమ్ము పెరుగుతుం దని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు విముక్తి కమిషన్ అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కేసును ఈనెల 18వ తేదీకి విచారణను వాయిదా వేసింది.