Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైరాశ్యంలో నేతలు
- ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న సీనియర్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికలకు ఒకరోజు ముందు వరకు ఎంతో హడావుడిగా ఉన్న గాంధీభవన్... ప్రతికూల ఫలితాలతో వెలవెలబోయింది. సిబ్బంది మినహా నాయకులు, కార్యకర్తలు కనిపించలేదు. ఎన్నికల ఊపు చూసి విజయం ఖాయమని బలంగా నమ్మిన ఆ పార్టీ ఫలితాల ముందు రోజు భవన్కు లైటింగ్ ఏర్పాటు చేసింది. అనంతర పరిణామాలతో నేతలకు కోలుకోలేని షాక్ తగిలింది. సుదీర్ఘరాజకీయ, పరిపాలన అనుభవం, అనేక ఎన్నికల్లో ఆటుపోట్లను ఎదుర్కొన్న నేతలు కూడా ఈ ఫలితాలను ఉహించలేక ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత ఘోరంగా పార్టీ ఓటమి పాలవుతుందని నాయకులు కలలో కూడా ఉహించలేదు. 'కాంగ్రెస్ వస్తోంది' అంటూ భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహించి, ప్రజల్లో కొంత నమ్మకాన్ని కల్పించింది. కానీ సీన్ రివర్స్ అయింది. పార్టీలోనూ, సొంత నియోజకవర్గాల్లోనూ తిరుగులేని సామాజ్య్రాలను నిర్మించు కున్న పార్టీ సీనియర్లు సైతం మట్టికరవడంతో పార్టీ శ్రేణుల్లో నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు నైరాశ్యంలో ఉన్నారు. దీంతో నాయకులంతా ఇంటికే పరిమితమయ్యారు. కోమటి రెడ్డి వెంకట్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గాంధీభవన్కు వచ్చిన పార్టీ శ్రేణులకు కనీస భరోసా ఇవ్వ లేని స్థితిలో నాయకులు ఉన్నారు. ఈ ఏపిసోడ్ మొత్తంలో ఎంతో మంది సీనియర్లు ఓడిపోయినా పెద్దగా మాట్లాడటం లేదు కానీ కొడంగల్ అభ్యర్థి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షు లు ఎనుముల రేవంత్రెడ్డి, డికె అరుణ, కొండా సురేఖ ఓడిపోవడాన్ని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు జీర్జించుకోలేకపోతున్నారు. కేసీఆర్ సవాల్కు ప్రతిసవాల్ విసిరి యావత్ పార్టీకి విశ్వాసాన్ని, భరోసాను కల్పించిన రేవంత్ పెవిలియన్ బాట పట్టడంతో జీర్ణించుకోలేకపోతు న్నారు. పార్టీలో ఆయనంటే గిట్టని నాయకులు సైతం ఆవేదన చెందుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి గెలిచినా...గాంధీభవన్కు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఓటమిపై అచీతుచీ స్పందించారు. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. ఓటమికి తమ బాధ్యత కాదన్నట్టు, ఈవీఎంల్లో జరిగిన లోపాల వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చినట్టు ఆయన చెప్పకనే చెప్పి యావత్ పార్టీని విస్మయపరిచారని ఒక సీనియర్ నేత చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో ఒక్క ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో (ఖమ్మం తప్ప) ఎక్కడా పట్టుమని నాలుగు సీట్లు సాధించలేని దుస్థితికి కాంగ్రెస్ దిగజారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5, నల్లగొండలో 3, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది.
జిల్లాల్లోనూ ఎండమావేనా?
ఎన్నికల ప్రచారంలో పార్టీకి వచ్చిన ఆదరణను చూసి దక్షిణ తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ఆశించింది. ఆ జిల్లాల్లో పరిస్థితి కూడా ఎండమావిగా మారింది. నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో స్వీప్ చేస్తామని ఆశలు పెట్టుకుంది. ఫలితాలు మాత్రం నిరాశ కల్గించాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఈ మూడు జిల్లాల్లో చావు దెబ్బతిన్నది. మహబూబ్నగర్లో 2014లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని హైదరాబాద్లోనూ కాంగ్రెస్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 23 స్థానాల్లో కేవలం మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీతో పొత్తు కలసివస్తుందని, తాము ఈసారి అనూహ్య ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఫలితం రివర్స్యింది. పాతబస్తీలో ఎంఐఎంకు గట్టిపోటీ ఇస్తామని గొప్పలు చెప్పుకున్నా...నాంపల్లి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మినహా మిగతా చోట్ల కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.