Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం జిల్లాలో ఓటమిపై కేసీఆర్ ఆరా
- ఇద్దరు ముఖ్యనేతలను నివేదిక కోరినట్టు వినికిడి
- మా నాయకులే ఓటమికి కారణమంటున్న అభ్యర్థులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కలిసి ఉమ్మడి బహిరంగసభల్లో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభలకు హాజరైన జనాలను చూస్తే విజయం తప్పదని సంకేతాలు రావడం.. ఎలాగైనా ఉమ్మడి ఖమ్మంను తమ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించుకున్న కేసీఆర్ రెండుసార్లు పర్యటించారు. అతని తనయుడు కేటీఆర్ ఎన్నికల ప్రచార ముగింపునకు ముందు రోజున ఖమ్మం నగరంలో రోడ్షో నిర్వహించారు. కానీ.. ఫలితాలు తారుమరయ్యాయి. టీఆర్ఎస్ చావు దెబ్బతిన్నది. రాష్ట్రం యావత్తూ ఫలితాలు ఒకెత్తు.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మరో ఎత్తు ! ఇంత ఘోరమైన ఫలితాలెలా వచ్చాయి? అసలేం జరిగిందని? అనే దానిపై అధినేత కేసీఆర్ ముఖ్యనేతలను నివేదిక కోరినట్టు సమాచారం.
జిల్లాలోని నాయకత్వాన్ని అతిగా గౌరవించడమేనా ఈ తరహా ఫలితాలకు కారణాలు..? ఇంటిదొంగలే పార్టీని దొంగదెబ్బతీశారా? తొమ్మిది నియోజకవర్గాల్లో పరాజయం చవిచూడటంతో కేసీఆర్కు మింగుడుపడటం లేదు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలపై రెండు రకాల సర్వేలతో పాటు ముఖ్యనాయకుల మధ్య ఉన్న వర్గపోరుపై కొరడా ఝళిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ని ఒత్తిళ్లున్నా రెండుసార్లు పర్యటించి ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాల్లో కేసీఆర్ చేసిన పర్యటనలకు విలువలేకుండా చేసిందెవరు? ఇప్పుడిదే టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
వైరా, కొత్తగూడెం ఫలితంపై మరో షాక్...
ఖమ్మం జిల్లాలోని వైరా, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో వెలువడిన ఫలితాలు టీఆర్ఎస్ను మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మదన్లాల్పై స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములునాయక్ 2013 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్లోని ముఖ్యనాయకునిగా ఉన్న వ్యక్తే మదన్లాల్ను కక్షగట్టి ఓడించారని సీఎంకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మదన్లాల్ పేరు ఖరారైనప్పటినుండే అతన్ని ఓడించి తీరుతామని టీఆర్ఎస్ నేతలే బహిరంగసభలు పెట్టి ప్రకటించారు. జిల్లాలోనే కీలక నేత అనుచరులంతా ఏకంగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ముఖ్యంగా ఇద్దరు ఎంపీపీలు, ఇద్దరు జడ్పీటీసీలు, మరో ఇద్దరు మార్కెట్ కమిటీ వైస్చైర్మన్లు, 14 మంది ఎంపీటీసీలు మూకుమ్మడిగా టీఆర్ఎస్కు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇదే నాయకులు ప్రస్తుతం గెలుపొందిన రాములునాయక్కు తమ మద్దతు తెలుపుతున్నామని కూడా మీడియాకు వెల్లడించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు గెలుపొందారు. ఈసారి వెంకటరావు 4120 ఓట్ల తేడాతో ఓటమి చెందడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ కూడా సొంతపార్టీకి చెందిన వారే కారును కుంగదీశారన్న ప్రచారం జరుగుతోంది.
మధిర ఫలితంపై అంతర్మథనం..
మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిపించి శాసనసభకు తీసుకొస్తానని పట్టుపట్టి సీటు ఇప్పించి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అహర్నిశలు కష్టపడ్డా చేదు ఫలితం వచ్చింది. ఇక్కడ కూడా ఓ పథకం ప్రకారమే కమల్రాజు ఓటమి ఖరారు అయినట్టు ఆ పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్లోనే ఒక గ్రూపు భట్టివిక్రమార్కకు సహకరించిందనే ప్రచారం ఉంది. ఇలా తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటమి పాలైన అభ్యర్థులంతా తమ ఓటమికి కారకులెవరో కూడా సీఎంకే నేరుగా వివరించినట్టు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ పూర్తివివరాలను సేకరించి పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిన ఆ నాయకులకు చెక్పెడతారనే చర్చ జరుగుతోంది.
పార్టీని చంపుకుంది మావాళ్లే..: సీఎం కేసీఆర్
'వాస్తవానికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నా..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా పార్టీ నాయకులే పార్టీని చంపుకున్నారు. పార్టీ ఓటమికి కారణాలు అన్వేషించుకుంటున్నాం. వాటి గురించి తరువాత' ఇలా ఎన్నికల ఫలితాల అనం తరం సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ప్రెస్మీట్లో అన్నారు. దీన్నిబట్టి కేసీఆర్ ఇక్కడి నేతలపై ఎంత గుర్రుగా ఉన్నారో అనేది అర్థమవుతోందని పార్టీలో చర్చ నడుస్తోంది. రాజకీయంగా మూడు దశాబ్దాల పాటు తిరుగులేని నాయకునిగా కొనసాగుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి గల కారణాలేంటి? టీఆర్ఎస్ పార్టీ ఏకంగా తొమ్మిది నియోజకవర్గాల్లో ఓటమి చెందడానికి కారణాలేంటి? అనేదానిపై కేసీఆర్ ఇప్పుడు రెండు రకాల నివేదికలు కోరినట్టు తెలుస్తోంది.