Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్కు భట్టి విక్రమార్క హెచ్చరిక
- ఓటమి శాశ్వతం కాదు...ధైర్యంగా ఉండండి: పార్టీ శ్రేణులకు భరోసా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రతిపక్ష నాయకులను బెదిరించి పరిపాలన చేయాలనే ధోరణి మానుకోవాలని కేసీఆర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, టీఆర్ఎస్ గెలుపు శాశ్వతం కాదని, కాంగ్రెస్ ఓటమి కూడా శాశ్వతం కాదని అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఓడిపోయి, మళ్లీ విజయం సాధించిన చరిత్ర కాంగ్రెస్పార్టీకి ఉందని ఉదహరించారు. పార్టీ ఓటమికి ఎవరో ఒక్కరు బాధ్యులు కాదని, సమిష్టి నాయకత్వమే దీనికి బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తామని తెలిపారు. గురువారం గాంధీభవన్లో కొత్త ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, పోడెం వీరయ్యలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. అధికార పార్టీ మాటలన్ని అహంకారపూరితంగా ఉన్నాయని, అటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తలు కుంగిపోవద్దని, భవిష్యతులో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ,చ తప్పకుండా పాటించాలని కోరారు. 'కారు' ఎక్కాలని తమ పార్టీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ ఒత్తిడి చేయడం సరైందికాదని చెప్పారు. కేసీఆర్ ప్రలోభాలకు తమ ఎమ్మెల్యేలు లొంగిపోరని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున నిలబడుతామని చెప్పారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యం కోసం కార్యకర్తలు పంచాయతీ పోటీ చేయాలని సూచించారు.