Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ సీట్లు మావే
- పెండింగ్ అంశాలను పార్లమెంటులో లేవనెత్తండి :
- టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్సే గెలుచుకోవాలని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో గట్టిగా పని చేయాలని ఎంపీలకు దిశా, నిర్దేశం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఎంపీలందరూ హాజరు కావాలంటూ ఆదేశించారు. ఎయిమ్స్తోపాటు మిగతా అన్ని అంశాలపైనా కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. బైసన్ పోలో గ్రౌండ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలంటూ డిమాండ్ చేయాలని అన్నారు. అనేక పెండింగ్ అంశాలపై కేంద్రానికి 33 సార్లు తాను స్వయంగా వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. అందువల్ల ఈసారి వాటిపై కేంద్రాన్ని నిలదీయాలని, పెండింగ్లో ఉన్న దాదాపు 52 అంశాలను జాతీయ స్థాయిలో ఎత్తి చూపాలని దిశా, నిర్దేశం చేశారు. వీటి విషయంలో కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు వెళ్లి మరోసారి వినతి పత్రాలు సమర్పించాలని ఎంపీలకు ఆయన సూచించారు. సమావేశానంతరం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్రెడ్డి మాట్లాడుతూ... రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో గట్టిగా పట్టుబట్టాలంటూ కేసీఆర్ సూచించారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలంటూ కేంద్రాన్ని కోరతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటం, జనవరి ఒకటి నాటికి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఇలాంటి అంశాలన్నింటిపై పార్లమెంటులో ఒత్తిడి తెస్తామని తెలిపారు.