Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభలో టిఆర్ఎస్ ఎంపీల ఆరోపణ
- టిడిపి ఎంపీల అభ్యంతరం
- ఇరు పార్టీల సభ్యులు పరస్పర వాగ్వాదం
- పిటిషన్ విచారణ పూర్తయ్యాక నిర్ణయం : సదానందగౌడ
నవ తెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉమ్మడి హైకోర్టు విభజన అంశం రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. లోక్సభ సాక్షిగా టిడిపి, టిఆర్ఎస్ ఎంపీలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. 'ఉమ్మడి హైకోర్టు ద్వారా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేలా పన్నాగం పన్నుతున్నారు' అని టిఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించడంతో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని, అయితే ప్రస్తుతం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైనందున న్యాయ పరిధిలో ఉన్న అంశంపై నిర్ణయం తీసుకోలేమని న్యాయశాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. అయితే ఎపి హైకోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన వసతులను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తామనడం ఆహ్వానించదగినదని, ఇదే అంశాన్ని న్యాయస్థానం ముందు తెలియజేసి సమస్యను ఒక కొలిక్కి తీసుకువద్దామని వెంకయ్యనాయుడు సూచించారు.
ఉమ్మడి హైకోర్టును సత్వరమే విభజించాలని కోరుతూ.. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచీ లోక్సభలో టిఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనతో కేంద్రంలో కదలిక వచ్చింది. విభజనపై బుధవారం లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ప్రకటన చేశారు.'ఎపి హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజిత వ్యాజ్యం దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేసేందుకు స్థలం చూడాలని మే 1న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం పిల్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఈ నెల 14వ తేదీన విచారణకు వస్తుంది. ప్రస్తుతం ఈ అంశం న్యాయ పరిధిలో ఉంది' అని తెలిపారు. అయితే విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని, ఇప్పటికే ఎపి ముఖ్యమంత్రికి, ఉమ్మడి హైకోరు ్టప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని తెలిపారు.
అభ్యంతరం లేనప్పుడు జాప్యమెందుకు జరుగుతోంది : జితేందర్రెడ్డి
హైకోర్టు విభజనకు కేంద్ర మంత్రులెవరకీ అభ్యంతరం లేనప్పుడు జాప్యమెందుకు జరుగుతోందని టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి ప్రశ్నించారు. దీంతోపాటు సదానందగౌడ చేసిన ప్రకటనలో కొత్తదనమేదీ లేదని పెదవి విరిచారు. హైకోర్టు విభజనను వెంకయ్యనాయుడు అడ్డుకుంటున్నారని మీడియాలో ఆరోపణలు వచ్చాయని కానీ 'ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావాల్సిందే' అని ఆయన మంగళవారం సభలో చాలా స్పస్టంగా పేర్కొన్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఆయన స్పందిస్తూ.. 'ఉమ్మడి హైకోర్టు తీర్పులో ఎపి హైకోర్టును ఆ రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. కానీ హైదరాబాద్లో హైకోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని వసతలూ అందుబాటులో ఉన్నాయి' అని తెలిపారు. అలాగే తెలంగాణలోని సీమాంధ్రులను తాము అతిథులుగా చూసుకుంటున్నామని వివరించారు. హైకోర్టు విభజన ప్రభుత్వ నిర్ణయం కాదని, రాజకీయ నిర్ణయమని మరోసారి పునరుద్ఘాటించారు. ఒకవేళ బుధవారం నాటి కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఆమోదిస్తే ఈ అంశం ఇక్కడికే ముగింపు అవుతుందని అన్నారు. ఇది న్యాయపరిధిలో లేదని స్పష్టం చేశారు.
కేంద్రం సహకరించడం లేదు : కవిత
ఉమ్మడి హైకోర్టు జడ్జి కేంద్ర ప్రభుత్వ పరిధిని సవాల్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని టిఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. అసలైతే కేంద్రమే పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్రం తమకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇది రాజకీయ అంశం. చంద్రబాబు నాయుడు హైకోర్టు ద్వారా తెలంగాణను పాలించాలనుకుంటున్నాడు' అని ఆరోపించారు. కవిత ఆరోపణలపై టిడిపి ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి ఎంపీలు తోట నరసింహం, రామ్మోహన్నాయడు, రవీందర్బాబు, అవంతి శ్రీనివాస్, గల్లా జయదేవ్ తమ స్థానాల్లో నిల్చుని కవిత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో టిఆర్ఎస్ ఎంపీలు బాల్క సుమన్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎపి ప్రభుత్వంపై, చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. అయితే వ్యక్తుల పేర్లను ప్రస్తావించొద్దని, ఎవరిపై ఆరోపణలు చేయొద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. ఎంపీ బాల్క సుమన్ కలుగజేసుకుని వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రాంతానికి చెందిన వారని, హైకోర్టు విభజనపై నిర్ణయం తీసుకోరని ఆరోపించారు. దీనిపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. 'ఇది చాలా అభ్యంతరకరం. మనం భారతీయులం. ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో సమస్యలేమిటో మాకు అవగాహన ఉంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేసే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం' అని అన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగానికి టిఆర్ఎస్ ఎంపీలు అడ్డుపడటంతో.. వెంకయ్యనాయుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'నేను చెప్పేది వినాలనుకోకపోతే వదిలేయండి. హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ మంత్రి చేసిన ప్రకటనను కూడా ఉపసంహరించుకోమంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి' అని కోపంగా అన్నారు.. విభజన సున్నితమైన విషయమని, దీన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. అయితే ఎంపీ వినోద్కుమార్ ఇచ్చిన సలహాలు ఆహ్వానించేవిగా ఉన్నాయని తెలిపారు. 'ఏపీకి శాశ్వత హైకోర్టు ఏర్పాటయ్యే వరకూ హైదరాబాద్లో తాత్కాలికంగా వసతులు కల్సిస్తామని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది అర్థవంతమైన సలహా అని ఆన్నారు. ఇదే విషయాన్ని కోర్టు ముందు తెలియజేద్దాం. సంతృప్తికరమైన పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. అలాగే కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను విన్నవిద్దామని తెలిపారు. హైకోర్టు విభజన విషయంలో రాజకీయ నిర్ణయం అయిపోయిందని, ప్రస్తుతం పరిపాలన చర్యలు అవసరమని తెలిపారు. అయితే టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ఎంపీలు ప్రతి అంశంలో చంద్రబాబును లాగుతున్నారని ఆరోపించారు. పునర్విభజన చట్టంలో సెక్షన్లు 8, 9, 10 కూడా ఉన్నాయని వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు.