Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మిషన్ కాకతీయ రెండవ దశ పనుల కోసం అధికార యంత్రాంగం సమాయత్తం కావాలని నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్రావు ఆదేశించారు. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలసి వివిధ జిల్లాల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన సూచించారు. రెండవ దశ పనులను అమలు చేసే ముందు హైదరాబాద్లో రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో ఎదురైన అనుభవాలు, ఇబ్బందుల గురించి ఆయన తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ కోసం గతంలో అందించిన సాంకేతిక పరికరాల వినియోగంపై హైదరాబాద్లో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను కోరారు. మిషన్ కాకతీయ విజయవంతం అయిన కథనాలను ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. వాట్సప్ వాడకం పట్ల అవగాహన పెంచుకుని వినియోగించాలని కోరారు. వాట్సప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ఫొటోలను పెట్టుకోవానలి పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో మిషన్ కాకతీయ పనులపై దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. చెరువులు నిండిన ప్రాంతాల్లో ప్రజల వద్దనుంచి వస్తున్న స్పందన గురించి తెలుసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తయిన చెరువుల వద్ద బుంగలు, నీటి లీకేజి వంటివి ఉంటే వాటికి మరమ్మత్తులు చేయాలని, చెరువు కట్టలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. చెరువు పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లోప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్ రావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ లు మురళీధరరావు, విజయప్రకాశ్ పలువురు ఎస్.ఇ.లు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష
ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి హరీశ్రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జలసౌధలో సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్రావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ మురళీధరరావు, విజరుప్రకాశ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్ మార్పు ద్వారా జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. రుద్రమ్మ కోట ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ ప్రాజెక్టును కొనసాగించలేమని, దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టేల్పాండ్ ప్రాజెక్టు రద్దు చేయడానికి కారణాలను మంత్రి హరీశ్రావు వివరించారు. మోడికుంట ప్రాజెక్టు కోసం అటవీ భూమిని సేకరించడానికి తీసుకోవలసిన చర్యలు, ప్రత్యామ్నాయ భూమి కేటాయింపుపై కూడా చర్చ జరిగింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ పంటకు నీరందించలేని పరిస్థితి ఉన్నందువల్ల ఈ విషయంలో రైతులను అప్రమత్తం చేయాలని మంత్రులు అధికారులను అదేశించారు.