Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలతో కునారిల్లుతున్న ఎర్రగడ్డ ఆస్పత్రి
- బయటా లోపల అపరిశుభ్రత
- మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు కంపు
- ఏడాదంతా మారని మెనూ..నీళ్లలా కూరలు
- స్వైర విహారం చేస్తున్న దోమలు, ఎలుకలు, నల్లులు
- కరెంటు పోతే చీకట్లోనే..నో జనరేటర్
- మందులు, పరీక్షలకూ బయటకే..
- డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత యథాతథం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య పురాణాల్లో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానముంది. ఎలాంటి జబ్బునైనా నయం చేస్తుందనేది రోగులు నమ్మకం. ఆధునిక వైద్యం వెలుగులోకి వచ్చాక ఇది కొంత వరకు మసకబారింది. కానీ, ఈ ఆయుర్వేద వైద్యానికి మళ్లీ వెలుగులు వచ్చాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆధునిక వైద్యం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్నా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఉండని వైద్యం ఆయుర్వేదంలో దొరుకుతుంది. రోగులు కూడా ఈ పురాతన వైద్యం మొగ్గు చూపుతున్నారు. మొండి వ్యాధులు అల్లోపతిలో నయం కాకపోవడంతో ఆయుర్వేద చికిత్స వైపు ఆకర్షితులవు తున్నారు. వైద్యులు సైతం ఆయుర్వేదం బెటరని సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది ఆయుర్వేద ఆస్పత్రుల బాటపట్టారు. హైదరాబాద్లో చరిత్ర కలిగిన ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి ఎంతో గుర్తింపు ఉన్నది. పక్షవాతం, పైల్స్, ఫిస్టుల వంటి చికిత్సకు ఈ ఆస్పత్రి పెట్టింది పేరు. దీంతో రోగులు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రతిరోజూ వందలాదిగా వస్తుంటారు. అయితే, రోగులు ఇక్కడికి రావలంటేనే హడలెత్తిపోతున్నారు. వైద్యులు సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నా.. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల సేవను పక్కనబెట్టి వారిపైనే దురుసుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సిబ్బంది అంతా డిప్యూటేషన్పై పనిచేస్తుండటంతో వారి ఆగడాలకు అంతేలేకుండా పోతున్నది. ఇక్కడ సరిపడా సౌక ర్యాలు లేకపోవడంతో రోగులు ఉసూరుమంటన్నారు. ఆస్పత్రి నిర్మించి దశాబ్దాలు కావటంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. దీంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. వర్షం పడితేచాలు ఆస్పత్రిలో ఉన్న రోగుల ప్రత్యేక గదుల్లోకి వరదనీరు చేరుతుంది. ఆవరణ చెరువును తలపిస్తుంది. పారిశుద్ధ్యం కోసం కోట్లాది రూపాయల వెచ్చిస్తున్నామని పాలకులు చెబుతున్నా ఈ ఆస్పత్రిలో అవేవీ కానరావు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన అపరిశుభ్రత తాండవిస్తుండటంతో పాములు, పందికొక్కులు, దోమలు, ఈగలు ఇతర ప్రమాదకర పురుగులు సంచరించడం సర్వసాధారణం. ఏడాదంతా ఒకే ఆహారం అందిస్తారు. నీళ్లలాంటి కూరలను రోగులకు వడ్డిస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తారు. ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో కరెంటు పోతే చీకట్లో మగ్గాల్సిందే. ఇలాంటి సమస్యలు ఎర్రగడ్డ ఆస్ప త్రిలోనే కాదు రాష్ట్రంలోని అన్ని ఆయుర్వేద ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి. 'నవతెలంగాణ' అందిస్తున్న కథనం..
రాష్ట్రంలో 320 పడకల సామర్థ్యం గల నాలుగు ఆయుర్వేద ఆస్పత్రులు ఉన్నాయి. హైదరాబాద్లో ఎర్రగడ్డ (100), చార్మినార్ (100), వరంగల్ అర్బన్ (100), మెదక్ జిల్లా తూఫ్రాన్లో (20) ఆస్పత్రులు ఉన్నాయి. వీటితోపాటు 224 రెగ్యులర్, 199 ఎన్ఆర్హెచ్ఎం ఆయుర్వేద డిస్పెన్సరీలు రోగులకు సేవలు అందిస్తున్నాయి. 11,091 మంది గుర్తింపు పొందిన డాక్టర్లు ఆయుర్వేదంలో ఉన్నారు. వీటిలో ఎర్రగడ్డ ఆస్పత్రికి ప్రతి రోజూ 500 ఔట్పేషంట్లు వస్తుండగా, 120 ఇన్పేషంట్లు చికిత్స పొందుతుంటారు. రోగుల తాకిడి పెరిగిపోవడంతో సిబ్బంది, మందులు సరిపడలేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. 90 శాతం మందులు బయటే కొనుగోలు చేయాల్సి వస్తున్నదని పటాన్చెరు చెందిన రాకేష్ 'నవతెలంగాణ'తో వాపోయారు. రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో గంటల తరబడి లైన్లో నిలబడి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇక రక్తనమూన పరీక్షలు కావాల్సి వస్తే మూడు రోజుల సమయం పడుతుంది.
ఈ ఆస్పత్రిలో 100 పడకల సామర్థం ఉంటే 350కి పైగా రోగులు వస్తుంటారు. చాలా మందికి పడకలు సరిపోకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రికి తెలుగు రాష్ట్రాలతోపాటు గుల్బర్గ, పూణె, నాందెడ్, ఒరిస్సా, జబల్పూర్ వంటి ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఓపీకి వచ్చే వారిలో కీళ్ల జబ్బులు, పక్షవాతం, మధుమేహం, బీపీ, జీర్ణకోశ వ్యాధులు, మానసిక వ్యాధులు, ఎయిడ్స్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఆర్షమొలలు, చెవి, చర్మవ్యాధులు, సుఖ వ్యాధులు, కామెర్లు, రక్తహీనత, గడ్డలు, ముక్కు, గొంతు, ప్రసూతి, స్త్రీ సమస్యలు, అధిక బరువు, కండరాల జబ్బులు, కంతులు, మూత్రాశయంలో రాళ్లు తదితర సమస్యలకు వైద్యం చేయించుకుంటారు. ముఖ్యంగా పక్షవాతం, పైల్స్, ఫిస్టులకు భగందరం (శస్త్రచికిత్స) ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి పెట్టింది పేరు. ఈ వ్యాధులకు గణీనీయంగా ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఆస్పత్రిలోని అద్దె గదుల్లోనే ఉంటూ పదుల సంఖ్యలో రోగులు ఇక్కడే కొన్ని వారాల పాటు వైద్యం పొందుతుంటారంటే నమ్మా ల్సిందే. అలాంటి ఆస్పత్రిని భయంకరమైన సౌకర్యాలు వెంటాడుతున్నాయి. దుర్వాసన, పాములు, పందికొక్కులతో ఎప్పుడేం జరుగుతుందోనని రోగులు వణికిపోతున్నారు. ఇక ఆస్పత్రిలో నాలుగే వార్డులు ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విరిగిన మంచాలు, చినిగిన దుప్పట్లతో సావాసం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను అద్దె వాహనాల్లో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలిస్తారు. ఇక చార్మినార్ ఆయుర్వేద ఆస్ప త్రిలోనూ పడకల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే వైద్యులు తాత్కాలిక చికిత్స అందించి పక్షం రోజుల తరువాత రమ్మంటారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు.
పక్షవాతం, జీర్ణకోశ సమస్యలు ఉన్న వారు ఇక్కడికి వస్తుంటారు. మలద్వార వ్యాధులు, స్త్రీ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, నేత్ర సమస్యలకు పూర్తి స్థాయి చికిత్సలను లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో అవసరం మేరకు సంబంధిత వ్యాధులకు శస్త్రచికిత్సలు కూడా చేస్తామని వైద్యులు తెలిపారు.
పక్షవాతం, నడుము, వెన్నముక లాంటి కేసులకు కొత్త తరహాలో చికిత్సను అందిస్తుంటారు. ఈ రెండు ఆస్పత్రుల్లో సుమారు 147 పోస్టులకు గానూ 87 మందే ఉండగా మరో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సీఎంలు, పాథా లజిస్టులు, ఫార్మసిస్టులు, సీనియర్ ఎంవోలు, స్టాఫ్ నర్సులు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, స్వీపర్లు తదితర పోస్టులు కొనేండ్లుగా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా ఉన్న సిబ్బంది తోనే నెట్టుకొస్తున్నారు.ఆస్పత్రుల్లో ఉన్న సమ స్యలను వెంటనే పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. ఆస్పత్రిలో నెలకొన్ని సమస్యలపై ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణిని వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.