Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత చరిత్రను గుర్తు తెచ్చుకుంటున్న వైనం
- పరిశీలనలో పలువురి పేర్లు
- వారితో ప్రత్యేకంగా భేటీకానున్న సీఎం
- పదవిపై విముఖత చూపుతున్న నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో యనమల రామకృష్ణుడు, ప్రతిభా భారతి, కె.సురేశ్ రెడ్డి, నాదెండ్ల మనోహర్.. తెలంగాణలో మధుసూదనాచారి.. వీరందరినీ పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. వీరందరూ శాసనసభలో స్పీకర్గా సేవలందించిన వారే. ఇదే సమయంలో వీరందరికీ ఓ ప్రత్యేకత కూడా ఉంది. స్పీకర్ పదవి తర్వాత జరిగిన ఎన్నికల్లో వీరందరూ ఎమ్మెల్యేలుగా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలో కొలువుదీరబోతున్న శాసనసభలో స్పీకర్ పదవిని చేపట్టేందుకు టీఆర్ఎస్ నేతలు వెనుకాముందూ ఆడుతున్నట్టు తెలిసింది. గత చరిత్రను గుర్తుకు తెచ్చుకుని స్పీకర్ సీటుపై వారు విముఖత ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ఈనెల 18న రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశ మయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. అదే రోజు నూతన శాసనసభ్యుల ప్రమాణస్వీకారంతోపాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్టు తెలిసింది. తెలంగాణ తొలి శాసనసభ సెప్టెంబరు ఆరో తేదీన రద్దయింది. తాజాగా ఎన్నికలు జరిగి, ఫలితాలు రావడంతో, రాష్ట్రంలో రెండో శాసనసభను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్అలీ ప్రమాణ స్వీకారంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. దీనికి ఈనెల 18వ తేదీ అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రొటెం స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్ లేదా ఎర్రబెల్లి దయాకర్రావులలో ఒకరిని నియమించే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో 18న శాసనసభ్యుల ప్రమాణం జరుగుతుంది. అదే రోజు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. సామాజిక సమీకరణాల కింద ఈ పదవికి బీసీని నియమించాల్సి వస్తే ఈటల రాజేందర్కు అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఓసీ అయితే పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎస్సీ కోటా కింద అయితే కొప్పుల ఈశ్వర్, ఎస్టీ అయితే రెడ్యానాయక్, మహిళకు ఇవ్వాలనుకుంటే పద్మాదేవేందర్రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉంటాయని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత చెప్పారు.
ఈ నేపథ్యంలో ఒకటి, రెండురోజుల్లో వారితో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ సందర్భంగా స్పీకర్ పదవికి ఎవరిని ఇవ్వాలనే అంశాన్ని ఆయన ఖరారు చేయనున్నారు. దీంతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కూడా ఆయన చర్చించే అవకాశముందని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 18న మంగళవారం కాబట్టి.. ఆ రోజు శాసనసభను సమావేశపరుస్తారా..? లేదా..? అనే అనుమానాన్ని కూడా ఆయా వర్గాలు వ్యక్తం చేయటం గమనార్హం.