Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60వేలు తీసుకుంటుండగా..
నవతెలంగాణ- కరీంనగర్
టింబర్ డిపో యజమానిపై నమోదైన కేసును తొలగించేందుకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రూ.60వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి..కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్కు చెందిన మహాలక్ష్మి టింబర్ డిపో యజమాని వేణు టాటాఏస్ వాహనంలో ఈనెల 6న కలప తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. కలపకు ఎలాంటి అనుమతీ లేదని రూ.2.30 లక్షల జరిమానా విధించారు. కేసు నమోదు చేసిన సమయంలో టింబర్ డిపోలోని రిజిస్ట్రర్లు, పర్మిట్ బుక్కులను కూడా సీజ్ చేశారు.అయితే, జరిమానా చెల్లించినప్పటికీ వాహనాన్ని, రిజిస్ట్రర్లు తిరిగి ఇవ్వలేదు. అవి ఇచ్చేందుకు అటవీశాఖ సెక్షన్ అధికారులు ఎండీ సాజిద్ పాషా, శ్రీనివాస్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని టింబర్ యజమాని వేణు ప్రాధేయపడటంతో రూ.60వేలకు ఒప్పుకున్నారు. అటవీశాఖ కార్యాలయం వాచ్మెన్ ఫసీ ద్వారా రికార్డులు పంపి రూ.60వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పూర్తి విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ కిరణ్ తెలిపారు.