Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడ్కోలు సభలో సుప్రీంకోర్టు జడ్జీ యంబి లోకూర్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడటం అత్యంత ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ బి లోకూర్ అన్నారు. న్యాయవ్యవస్థతోపాటు బార్ స్వతంత్రతనూ కాపాడాలని తెలిపారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఇది అత్యంత కీలకమని వివరించారు. అత్యున్నత న్యాయస్థాన ప్రాంగణంలో జస్టిస్ లోకూర్ కోసం.. సుప్రీంకోర్టు బార్ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 29న పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ లోకూర్కు శుక్రవారమే చివరి పనిదినం. శనివారం నుంచి రెండువారాలపాటు కోర్టుకు సెలవులున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. దిగువ న్యాయస్థానాల్లో సుమారు 2.91 కోట్ల కేసులు, హైకోర్టులో దాదాపు 40లక్షల కేసులు పెండింగ్లో ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దిగువ న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం, మౌలికవసతులకోసం సీజేఐ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతినివ్వాలని అన్నారు. కాగా, సీజేఐ రంజన్ గొగోరు మాట్లాడుతూ.. లోకూర్తో తనది 50ఏండ్ల భావోద్వేగపూరిత స్నేహమని తెలిపారు. లోకూర్ రిటైర్మెంట్తో తన కుడి చేయి దూరమవుతున్నట్టుగా అనిపిస్తున్నదని అన్నారు. ఆయన పౌరులు, బాధితుల పక్షపాతి అని చెప్పారు. న్యాయమూర్తిగా లోకూర్ శ్రేష్టుడని నిస్సందేహంగా చెప్పవచ్చునని తెలిపారు. ఆయన తీర్పులు భవిష్యత్తు జడ్జీలకు దిక్సూచిగా ఉపయోగపడతాయని వివరించారు. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మాట్లాడుతూ.. 'లోకూర్తో తీవ్ర చర్చకు దిగిన ప్రతిసారీ అంతిమంగా నేర్చుకునేది నేనే' అని అన్నారు.