Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకెపీ సెంటర్లోనే మృతి
నవతెలంగాణ- బయ్యారం
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే.. అకాల వర్షం నిండా ముంచింది. తడిసిన ధాన్యాన్ని చూసిన కౌలు రైతు కుప్పకూలాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో శనివారం జరిగింది.
బయ్యారం మండల కేంద్రానికి చెందిన జలగం రాందాస్(35) ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. 200 బస్తాల ధాన్యాన్ని మండల పరిధిలోని కట్టుగుడెం సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. తేమ శాతం ఎక్కువగా ఉందని అక్కడి సిబ్బంది చెప్పడంతో 10 రోజులుగా అక్కడే ధాన్యాన్ని ఆరబెట్టాడు. శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో ధాన్యం మొత్తం తడిసింది. అది చూసిన రైతు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణం కోల్పోయాడు. రాందాస్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెట్టుబడుల కోసం దాదాపు 2 లక్షలు అప్పులు చేసినట్టు రాందాస్ భార్య తెలిపింది. రాందాస్ మృతదేహాన్ని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ సందర్శించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డేవిడ్తో మాట్లాడారు. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
అకాలవర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండల పరిధిలోని సత్యనారాయణపురం వద్ద ఇల్లందు - మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ... తేమ శాతం పేరుతో ధాన్యం కొనకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామనీ, ఈ క్రమంలో అకాల వర్షం కారణంగా ఎండిబెట్టిన ధాన్యం తడిసి పోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలం వద్దకు ఆర్డిఓ కొమరయ్య, సీఐ రమేష్ చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వమే కొనేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.