Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్లో హరీశ్ స్థానంపై చర్చోపచర్చలు
- ఆయన లేకుండానే సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
- ఎన్నికల సమయంలోనూ దూరంగా పెట్టిన వైనం
- కేసీఆర్ సయోధ్యతో మళ్లీ రంగంలోకి
- ఇప్పుడు కేటీఆర్ దూకుడుతో ఒకింత ఇబ్బంది
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'శనివారం ఉదయం హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు.. కార్యకర్తలు. వారి వాహనాలతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్' ఇటు టీవీ ఛానళ్లలోనూ, అటు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయిన వార్త ఇది. ఇందుకు సంబంధించిన వీడియో లు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పైకి చూస్తే ఇది చాలా సాదాసీదా విషయం. కానీ ఇందులోనే అసలు విషయం దాగుందంటున్నారు విశ్లేషకులు. శనివారం ప్రగతి భవన్లో సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ హరీశ్ లేకపోవటం గమనార్హం. నిన్నటిదాకా ఆ శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తిగా సాగునీటి రంగంపై కొంత పట్టు సాధించిన హరీశ్... రివ్యూ మీటింగులో లేకపోవటం చర్చనీయాంశమవుతున్నది. ఇం దులో పరిపాలనాపరమైన అంశాలతోపాటు రాజకీయ విష యాలు దాగున్నాయని తెలుస్తున్నది. వాస్తవానికి ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో హరీశ్ స్థానమేమిటనే అనుమానాలు తలెత్తాయి. ఆయన్ను క్రమక్రమంగా పక్కకు పెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నదనే ఊహాగానాలూ వెలువడ్డాయి. వీటికి మరింత బలం చేకూరుస్తూ.. 'ప్రజాభిమానం మెం డుగా ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఇమేజ్ ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది...' అంటూ హరీశ్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన అనుచరులు, మద్దతుదా రులు, అభిమానుల్లో ఒకింత కలవరం మొదలైంది. వారిని మరింత కలవర పెడుతూ హరీశ్ కొద్ది రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ సందర్భంగా టీఆర్ఎస్ సొంత మీడి యాలో సైతం హరీశ్కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేశా రు. దీంతో అధికార పార్టీలో పెద్ద దుమారమే రేగింది. పరిస్థితిని గమనించిన కేసీఆర్ వెంటనే హరీశ్తో చర్చలు జరిపి ఆయన్ను శాంతింపజేశారు. దీంతో ఆయన మళ్లీ రం గంలోకి వచ్చి.. ప్రచారంనిర్వహించారు. అప్పటికి కథ సుఖాంతమైంది. ఎన్నికల అనంతరం ఇప్పుడు మళ్లీ అదే కథ పునరావృ తమవుతున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవటం, ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కేటీఆర్ను ట్రబుల్ షూటర్గా పేర్కొంటూ ఆయన్ను కీర్తించటం చక చకా జరిగిపోయాయి. ఆ వెంటనే ఎలాంటి గ్యాప్ లేకుండా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. దీంతో పార్టీలో కేటీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి పరిణామాలన్నింటి మధ్య టీఆర్ఎస్లో హరీశ్ స్థానమేంటో అర్థంగాక ఆయన అనుచరగణం అయోమయంలో పడుతు న్నారు. మరోవైపు హరీశ్ను సాగునీటి పారుదలశాఖ నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే హరీశ్ కూడా దూకుడు పెంచుతున్నారని వినికిడి. ఇందులో భాగంగానే ఆయన కూడా బల ప్రదర్శన చేశారని సమాచారం.
మార్చిలో కేటీఆర్కు పట్టాభిషేకం..?
అత్యంత విశ్వసనీయ సమచారం ప్రకారం... వచ్చే మార్చిలో.. పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కేటీఆర్ను సీఎంగా ప్రమోట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతు న్నాయి. ఆ దిశలో పార్టీలో పరిణామాలు మారుతున్నాయని సమాచారం. ఇందుకు అనుగుణంగానే పార్టీపై కేటీఆర్ తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ఆయన కార్యాచరణ రూపొందించుకుంటు న్నారు. రాష్ట కమిటీ, జిల్లా కమిటీల్లో పునర్ నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదనుగా తన అను కూల వర్గీయులతో ఆయా కమిటీలను నింపేందుకు యోచి స్తున్నారు. జిల్లా పర్యటనలు, జిల్లా పార్టీ మహసభల ద్వారా పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తు న్నారని తెలుస్తున్నది. ఈ విధంగా పార్టీ మీద పట్టు సాధిస్తే సీఎం పదవిని సులభంగా చేజిక్కించుకోవచ్చన్నది ఆయన భావన. గతంలో పార్టీలకు జనరల్ సెక్రటరీలుగా వ్యవహ రించిన కరుణానిధి, చంద్రబాబులు పార్టీ మీద పట్టు సాధిం చిన తర్వాత సీఎం సీటును అవలీలగా చేజిక్కించున్నారని ఈ సందర్భంగా ఓ టీఆర్ఎస్ నేత గుర్తుచేశారు. అందువల్ల డిసెంబర్లో జిల్లా పర్యటనలు, జనవరిలో పంచాయితీ ఎన్నికలు, ఫిబ్రవరిలో పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ను పూర్తి చేసి.. మార్చిలోపు పార్టీ మీద పట్టు సాధిం చాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లోక్సభ ఎన్నికల నిమిత్తం ఫెడరల్ ఫ్రంట్ పనుల్లో కేసీఆర్ బిజీ అయిపోతారు. అందుకోసం ఆయన తన పూర్తి సమయాన్ని ఢిల్లీలోనే గడిపే అవకాశముంది. ఈ పేరుతో కేటీఆర్ను తన వారసుడిగా ప్రకటించి.. సీఎంగా బాధ్యతలు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో ఆయనకు హరీశ్, కడియం, ఈటలలాంటి సీనియర్లతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేం దుకు వీలుగా వారిని పార్లమెంటు ఎన్నికల్లో నిలబెట్టేందుకు కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం.