Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో గతం కంటే మా బలం తగ్గింది
- కారణాలపై పార్టీకి ప్రాథమిక నివేదిక
- రెండు రోజులపాటు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు: తమ్మినేని
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో సీపీఐ(ఎం) ఆశించిన రీతిలో సీట్లు రాలేదని, గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లు కూడా తగ్గాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. అందుకు గల కారణాలపై కేంద్ర కమిటీలో చర్చలు జరపుతున్నట్టు ఆయన తెలిపారు. శనివారమిక్కడ సీపీఐ(ఎం) జాతీయ కార్యాలయంలో కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి నాగయ్యతో పాటు తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ లోతుగా చర్చించినట్టు తెలిపారు.
రాజస్థాన్లో ఓటింగ్ పెరగడం, పార్టీకి ఆశించినమేర ప్రాతినిధ్యం రావడం సంతోషకరమన్నారు. అయితే, తెలంగాణలో పార్టీకి ఆశించిన మేర సీట్లు రాలేదని అన్నారు. అందుకు సంబంధించిన కారణాలపై పార్టీకి ప్రాథమిక నివేదిక అందజేసినట్టు స్పష్టం చేశారు. అధికార టీఆర్ఎస్ సంక్షేమ పథకాల ప్రభావం, కాంగ్రెస్ కూటమి ప్రజాభిమానాన్ని చూరగొనకపోవడం, తెలంగాణ సెంటిమెం ట్, ధన ప్రవాహం ఫలితాల్లో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. ఈ కారణాల చేతనే టీఆర్ఎస్ మళ్ళీ అధికారం చేపట్ట గల్గిందన్నారు. ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్ ముందుగా వచ్చినా, ధన ప్రభావంతో నిలవలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది ఎన్నికలన్నీ కార్పొరేట్మయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరున జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో చర్చించనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లో తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణ, 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై మంతనాలు జరిపినట్టు తెలిపారు. కాగా, ఈ సమావేశాలకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి రాఘవులు, బృందా కరత్, కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పీ మధు, కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.