Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ :
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ
నవతెలంగాణ- జోగులాంబప్రతినిధి
శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్తోనే టీఆర్ఎస్ విజయం సాధించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారన్నారని విమర్శించారు. గ్రామాల్లో ఓట్లు వేసినా అవి పోల్ కావలేవని ప్రజలు వాపోతున్నట్టు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుజన వాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని చెప్పారు. కానీ దానిని ఓటింగ్ రూపంలో తీసుకొచ్చే క్రమంలో వెనుకబడ్డామన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం, బహుజనులను సంఘటితం చేస్తూ ఉధృత పోరాటాలు నిర్వహిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ బహుజనుల ఐక్యత కోసం పని చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీఎల్ఎఫ్ పోటీ చేస్తుందని చెప్పారు.
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం అంబేద్కర్, పూలే ఆశయాల సాధన కోసం యువత బీఎల్ఎఫ్తో భాగస్వామ్యం కావాలన్నారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతికి వ్యతిరేకంగా జనవరి 8, 9వ తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో చేసే పోరాటాల్లో సీపీఐ, టీజేఎస్, మంద కృష్ణమాదిగ, ఆర్.కృష్టయ్య, గద్దర్ లాంటి మేధావులు తమతో కలిసి రావాలని కోరారు. సీపీఐ(ఎం), బీఎల్ఎఫ్కు ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, దేవదాసు, రాజు, ఉప్పేరు నర్సింహా, నర్మద తదితరులు పాల్గొన్నారు.