Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీల అమలుకు భారీగా నిధులు
- నెలకు ఆదాయం రూ.8 వేల కోట్లు
- ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.20 వేల కోట్ల అప్పు
- తేల్చి చెబుతున్న కాగ్ లెక్కలు
- కీలక పథకాలకు నిబంధనలు కఠినతరమయ్యే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారంతో రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఆ పార్టీ విజయంలో ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలు కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అయితే ఈసారి వీటి అమలు అంత ఈజీ కాదంటున్నాయి ఆర్థికశాఖ వర్గాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు చివరి నాటికి ఖజానాకు రూ.52,522 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు నెలకు సుమారుగా రూ.8 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, జీత భత్యాలు, ఆసరా పెన్షన్లు, అప్పులకు వడ్డీలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, ఇతరత్రా మెయింటెన్స్కు కలిపి రూ.6,500 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రూ.1,500 కోట్లతోనే అన్ని పథకాలు, కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ సర్కారు సుమారు రూ.20 వేల కోట్ల మేర అప్పులు చేసింది. దీంతోపాటు మరో రూ.20 వేల కోట్ల రెవెన్యూ లోటుతో బడ్జెట్ నడుస్తున్నది కాగ్ తన లెక్కల్లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలకు నిధుల గండం ఉండే అవకాశముంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వీటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే. కానీ అందుకు ఆర్థిక పరిస్థితి సహకరించే అవకాశముంటుందా? లేదా? అన్నది అనుమానం. ఈ క్రమంలో రైతు బంధు, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలకు నిబంధనలు కఠినతరం చేసే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీంతోపాటు రైతు రుణమాఫీ పథకాన్ని మరోసారి అమలు చేస్తామంటూ టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. లక్ష వరకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని అందులో పేర్కొన్నారు. అయితే ఏకమొత్తంలో అమలు చేస్తారా? లేదా..? అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. గతంలో మొత్తం రూ.17 వేల కోట్లతో నాలుగు విడతలుగా ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు తదితర హామీల నేపథ్యంలో ఆయా పథకాల కోసమే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆసరా పెన్షన్ల కోసం ప్రస్తుతం నెలకు రూ.500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇప్పుడు వీటిని రెట్టింపు చేస్తామన్నారు కాబట్టి రూ.1000 కోట్లు కేటాయించాలి. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీని ఈసారి ఎలా అమలు చేస్తారన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది.
ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకు పోయాయి. ఇవన్నీ కలిపి రూ.10 వేల కోట్ల వరకూ ఉన్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వీటితోపాటు ఇప్పటి వరకూ ఉన్న రూ.2.50 లక్షల కోట్ల అప్పులన్నింటికీ కలిపి ప్రభుత్వం నెలకు రూ.7 వేల కోట్ల వరకూ వడ్డీలను చెల్లిస్తున్నది. ఇవిగాక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను ఈ యేడాది నుంచి తీర్చాలి ఉంటుంది. నెలల వారీగా చెల్లించాల్సివని పోను మిగతా అప్పుకు వడ్డీ కూడా కట్టాలి. ఈ నేపథ్యంలో సర్కారుకు మున్ముందు ఆర్థికంగా పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. వీటిని టీఆర్ఎస్ సర్కారు ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.