Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ మారుతారన్న వదంతులు నమ్మకండి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కచ్చితంగా గెలుస్తామనీ, తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ టీఆర్ఎస్లోకి వెళ్లడం లేదనీ, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దనీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్కు చెందిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులతో కలిసి భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ యథేచ్ఛగా డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగం చేసి తిరిగి అధికారంలోకి వచ్చిందన్నారు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం జిల్లా ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని నిలబెట్టేలా ప్రజాకూటమి వైపు నిలిచారన్నారు. పదిస్థానాల్లో కేవలం ఒక్కటి మాత్రమే టీఆర్ఎస్ గెలిచిందన్నారు. మిగతా స్థానాల్లో ప్రజాకూటమికి పట్టంకడుతూ ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపించారన్నారు. జిల్లా ప్రజలకు రుణపడి ఉంటామనీ, వారి నమ్మకాన్ని ఎట్టిపరిస్థితిలోనూ వమ్ము చేయబోమనీ అన్నారు.