Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాలు నిగ్గుతేల్చాలి : ఏసీబీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''మహిళలు సర్పంచ్లుగా ఉన్న గ్రామాల్లో, వారి భర్తలు పెత్తనం చేస్తున్నారు. భార్య సర్పంచ్గా ఉంటే భర్త కాంట్రాక్టర్ అవతారం ఎత్తుతున్నాడు. ప్రభుత్వ నిధులు గుటకాయస్వాహా చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ కింద కేంద్రం నుంచి పంచాయతీలకు వస్తున్న నిధులు వారి భర్తలు తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. పనులు చేయకుండానే నిధుల్ని కాజేస్తున్నారు '' అని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలో స్వచ్చ భారత్ కింద చేసిన మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.40 లక్షలు స్వాహా అయ్యాయని, ఇందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు కారణమని, నిధుల్ని వారి ఖాతాల్లో వేసేసుకున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పేర్కొంటూ ఎం. శేఖర్రెడ్డి అనే వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యం కింద మంగళవారం మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), న్యాయసేవాధికార సంస్థలు వేర్వేరుగా నార్సింగ్ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలపై నివేదికలు అందజేశాయి. వాటిని ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్వీ భట్లతో కూడిన డివిజన్ బెంచ్ పరిశీలించి. ఒక్క గ్రామంలోనే స్వచ్ఛ భారత్ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి ఇంత దారుణంగా ఉంటే మిగతా చోట్ల పరిస్థితులు ఇలాగే ఉంటాయని వ్యాఖ్యానించింది. వెంటనే నాలుగైదు గ్రామాలను ఎంపిక చేసి మరుగుదొడ్ల నిర్మాణాలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ను ఆదేశించింది. నిధులు ఎంత వచ్చాయి ? ఎన్ని మరుగుదొడ్లను నిర్మించారు ? ఎంత మేరకు నిధులు సద్వినియోగం అయ్యాయి ? దుర్వినియోగం అయిన నిధులు వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. స్వచ్ఛ భారత్ డైరెక్టర్ను సుమోటోగా ప్రతివాదిని చేసి నోటీసు ఇచ్చింది. తమకు అందిన నివేదికలు రెంటింటినీ చూస్తే ఒక్క గ్రామంలో ఇంత దారుణంగా నిధులు స్వాహా చేశారంటే ఇతర గ్రామాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని అనిపించడం లేదని, సర్పంచ్లపై చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయవచ్చునని, పూర్తి స్థాయిలో తెలంగాణలోని గ్రామాల్లో ఏమేరకు మరుగుదొడ్ల నిధులు స్వాహా జరిగిందో తేల్చిన తర్వాతే తగిన ఆదేశాలిస్తామని హైకోర్టు ప్రకటించింది. విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది.ఝ