Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మిర్యాలగూడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మిర్యాలగూడను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు జూలకంటి రంగారెడ్డి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భంగా మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, బంద్లు వంటి కార్యక్రమాలు జరిగాయని ఓ ప్రకటనలో తెలిపారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్లీడర్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. అయినా మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకపోవడంతో ఎదురుచూసిన ప్రజలు నిరాశకు గురయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు వారి పార్టీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడను వెంటనే జిల్లాగా ప్రకటింపచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ములుగు, నారాయణపేట జిల్లాల జాబితాలో మిర్యాలగూడ లేకపోవడంతో ప్రజలు మరోసారి ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. జిల్లాకు కావాల్సిన భౌగోళిక స్వరూపం మిర్యాలగూడకు ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద యాదాద్రి పవర్ ప్రాజెక్టు దామరచర్లలో నిర్మాణమవుతోందని తెలిపారు. వందల సంఖ్యలో ఫార్బాయిల్డ్ రైస్మిల్లులతోపాటు, అనేక సిమెంటు పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలున్నాయని పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంతోపాటు, అతిపెద్ద భారీ ప్రాజెక్టు నాగార్జునసాగర్ కూడా ఈ ప్రాంతంలోనే ఉందని తెలిపారు. ఇది ఆంధ్రా-తెలంగాణకు సరిహద్దు ప్రాంతమని పేర్కొన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో పట్టణాలతో కలిపి మొత్తం 18 మండలాలున్నాయని తెలిపారు. సుమారు పది లక్షల మంది జనాభా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వివిధ ప్రభుత్వ శాఖల భవనాలు, ఖాళీ స్థలాలు మిర్యాలగూడ పట్టణంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సహృదయంతో పరిశీలించి మిర్యాలగూడను జిల్లాను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని కోరారు.