Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కొప్పుల' నేను ఫిర్యాదు చేసేంత పెద్ద వ్యక్తేమీ కాదు
- ఎమ్మెల్యేలను గెలిపించామని విర్రవీగుతున్నారు : ఇష్టాగోష్టిలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీ అంతరంగికులు, జాతీయ ఎస్సీ సెల్ మాజీ చైర్మెన్ కొప్పుల రాజుపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆయన జోక్యం ఎక్కువగా ఉందని, అయినప్పటికి ఆయన తాను ఫిర్యాదు చేసేంత పెద్ద వ్యక్తేమీ కాదని చెప్పారు. ఆయన చేసిన తప్పిదాల వల్ల పార్టీ నష్టపోయిందని విమర్శించారు. గురువారం తన నివాసంలో ఆమె ఇష్టాగోష్టిలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బినామీ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని, అందుకే పార్టీ పరిస్థితి రోజురోజూకు ఇలా దిగజారుతోందని చెప్పారు. కమ్మ సామాజికవర్గమన్న సాకు చూపి జెట్టి కుసుమకుమార్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ఏమిటని, ఆయనను ఎవరైనా గుర్తుపడతారా? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి తాను కేంద్ర మంత్రిగా ఉండగానే అయిందన్నారు. ఖమ్మం ఎంపీ టిక్కెట్ అధిష్టానం ఎవ్వరికి ఇచ్చినా సరే కానీ స్థానికులకే ఇవ్వాలని సూచించారు. స్థానికేతరులను బరిలోకి దించితే కార్యకర్తలు ఊరుకోబోరని చెప్పారు. ఖమ్మంలో పార్టీని గెలిపించామంటూ గొప్పలు చెప్పుకునే నాయకులకు సిగ్గు ఉండాలన్నారు. తాను ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేశానని, అనేక సమస్యలపై ఆందోళనలు నిర్వహించానని వివరించారు. తామే గెలిపించామంటూ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని నేతలను హెచ్చరించారు. ముందస్తు ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఉండేదని చెప్పారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, తాను అన్ని పదవులు చేపట్టానన్నారు. పార్టీలో కొత్తగా పదవులు వచ్చినా నేతలు చాలా ఫీల్ అవుతున్నారని పరోక్షంగా ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొందరు ఖమ్మంలో ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల పట్టుదల వల్లే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుందన్నారు. పార్టీ ఓటమికి నాయకత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నేతకు సీఎల్పీ నేత పదవి ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.