Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారులకు అనుకూలంగా రవాణా వ్యవస్థ
- ప్రయాణభారం, పనిఒత్తిడితో ప్రజా ఉద్యమాలకు కార్మికులు దూరం :సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు
- ఏటా ప్రభుత్వం నిధులిస్తే ఆర్టీసీ బలోపేతం : డిజి
- మెట్రో కోసం ఆర్టీసీ నిర్వీర్యం : దొంతి
- రూ. ఐదారు వేల కోట్లిస్తే ఎమ్ఎమ్టీఎస్ అందుబాటులోకి : రామచంద్రయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వృత్తిపరంగా నివాసప్రాంతాలకు, ఆఫీసులకు మధ్య దూరం పెరిగి ప్రజలపై భారం పడుతున్నదని, అందుకే ప్రజలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను విస్తరించాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'పట్నం' ఆధ్వర్యంలో 'ప్రజలు-ప్రజా రవాణా' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. 2050 నాటికి పట్టణాల్లో అత్యధిక జనాభా కేంద్రీకృ తమవుతుందని, ఈ నేపథ్యంలోనే ప్రజారవా ణాకు ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతున్నద న్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రవాణా వ్యవస్థను రూపొందించాలన్నారు. పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెట్టేవిధంగా పాలకులు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఉంటే దాని పక్కనే కార్మికులు, ఉద్యోగుల కోసం క్వార్టర్లు ఉండేవని, దీంతో రవాణా భారం వారిపై ఉండేది కాదని అన్నారు. కార్పొరేటు, ప్రయివేటు కంపెనీలు లాభాల మీద దృష్టిపెట్టి కార్మికులకు ఆవాస కల్పననే మర్చిపోయాయన్నారు. దీంతో కార్మికులు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆఫీసుల్లో 8 గంటలు పనిచేస్తున్నారని, ప్రయాణానికి 8 గంటలు పడుతున్నదని చెప్పారు. దీనివల్ల కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోతున్నారని, ఫలితంగా ప్రజా ఉద్యమాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ప్రజలకు అనుగుణంగా కాకుండా ధనికులకు అనుగుణంగా రవాణా వ్యవస్థ రూపుదిద్దుకొంటున్నదన్నారు. ప్రజలపైన ప్రేమతో ఫుట్ఓవర్ బ్రిడ్జీలు కట్టట్లేదని, కార్ల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మిస్తున్నారని ఉదహరించారు. ఫుట్ఓవర్ బ్రిడ్జీలు ఎక్కి, దిగి సామాన్యులు కీళ్లనొప్పులు, రోగాల పాలవుతున్నారని వివరించారు. పాదచారులు, బస్సులు, కారులు, సైకిల్, బైకులపై వెళ్లేవారికి అనుగుణంగా రోడ్లను డివైడ్ చేయాలన్నారు.
పట్నం ప్రధాన కార్యదర్శి డిజి. నర్సింహారావు మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం పట్టణాలకు ఆరేడు లక్షల మంది వలస వస్తున్నారని, దీనికి అనుగుణంగా రవాణా వ్యవస్థ విస్తరించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్నదని, ఢిల్లీ తర్వాత హైదరాబాదే అత్యంత కాలుష్య నగరంగా మారబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 31 శాతం జనాభా అవసరాలను ఆర్టీసీనే తీర్చుతున్నదని, కానీ, ఆ సంస్థ పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. జనరమ్ కింద వచ్చిన బస్సులు కాలుష్యకారకాలుగా మారాయని విమర్శించారు. తమిళనాడు, కర్నాటక, కేరళ ఆర్టీసీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతియేటా రూ.500 నుంచి వెయ్యి కోట్లు ఇస్తున్నాయని గుర్తుచేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం అలా చేయకుండా మెట్రోకు రూ.16 నుంచి 17 వేల కోట్లు ఇచ్చిందని విమర్శించారు. హైదరాబాద్లో జరిగే ప్రమాదాల్లో పాదచారులే 33 శాతం మంది చనిపోతున్నారని, ఇది మన ప్రజారవాణా వ్యవస్థ లోపాన్ని ఎత్తిచూపుతున్నదన్నారు.
ప్రపంచంలో ఆయా దేశాలు ప్రజారవాణాను ప్రోత్సహిస్తున్నాయని, మన దగ్గర మాత్రం ప్రయివేటు ట్రాన్స్ఫోర్ట్కు లాభాలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు. మెట్రో ఆర్టీసీని మింగేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బలోపేతం, ప్రజారవాణా విస్తరణ కోసం వచ్చే ఆరు నెలల్లో పోరాటాలు చేస్తామని ప్రకటించారు. సామాజిక విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి ప్రజారవాణా వ్యవస్థపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలకులు కావాలనే మెట్రో కోసం టీఎస్ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని, మరోవైపు రెండో విడత ఎమ్ఎమ్టీఎస్ను కావాలనే తొక్కిపెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం సామాజికమయంగా ఉండాలని ఆకాంక్షించారు. రోడ్లల్లో 10 శాతం స్థలాన్ని పాదచారులకే కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు. రింగ్రోడ్లు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ధనికులు ప్రయాణం చేసేందుకు వెసులుబాటుగా వేస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య మాట్లాడుతూ..ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే హైదరాబాద్లో మూడేండ్లల్లో ఎమ్ఎమ్టీఎస్ను పూర్తిగా అందుబాటులోకి తేవొచ్చన్నారు. బీఆర్టీఎస్పై నేడు చర్చే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రోతో ఆర్టీసీ బస్టాఫ్లన్నీ పాడైపోయాయని పలు ఉదహరణలతో వివరించారు. ఎస్ఆర్ నగర్ సెంటర్లో గంటకు 27 వేల వాహనాలు వెళ్తాయని, అలాంటి రోడ్లల్లో పాదచారులకు ఏర్పాట్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. నగర మాస్టర్ప్లాన్లను పాలకులు తమకు ఇష్టమొచ్చినట్టు మారుస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ..పట్టణ జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను విస్తరించాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుదలకు మరింత అధ్యయనం చేయాలన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్రావు మాట్లాడుతూ..ప్రతి ఏటా 12 శాతం బస్సులను పెంచాలని, కానీ, రాష్ట్రంలో పదేండ్ల నుంచి ఉన్న బస్సుల సంఖ్యే క్రమంగా తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి ఒక శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా మెట్రోలో ప్రజల్ని ఎక్కించే కుట్రలో భాగంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 'పట్నం' రాష్ట్ర అధ్యక్షులు కె.వేణుగోపాల్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు, ఐద్వా నేతలు బత్తుల హైమావతి, మల్లు లక్ష్మి, ఆయా ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.