Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 వరకూ అసెంబ్లీ కొనసాగింపు
- ముఖ్యమంత్రే ఆర్థిక మంత్రా...?
- రాష్ట్ర క్యాబినెట్పై కొనసాగుతున్న సస్పెన్స్
- బర్త్ డే బహుమతి ఉంటుందా?
- నేతల్లో ఉత్కంఠ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11.30 గంటలకు పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఈనెల 25 వరకూ కొనసాగనున్నాయి. 23న బడ్జెట్పై చర్చను ప్రారంభిస్తారు. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.
మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా బడ్జెట్కు రూపకల్పన చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చూడాలని.. బడ్జెట్లో తగిన ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులను కేటాయించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు హోం మంత్రి మహమూద్ అలీ మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెణ్నెల్లు దాటినా క్యాబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి దృష్టి సారించలేదనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఎవరి అంచనాలకూ అందకుండా సీఎం కేసీఆర్.. క్యాబినెట్ విస్తరణపై ఇప్పటి వరకూ సస్పెన్స్ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈనెల 22న బడ్జెట్ను ప్రతిపాదిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బడ్జెట్ ప్రతిపాదన ఓకే.. కానీ ఆర్థిక మంత్రి లేకుండానే పద్దును సభకు సమర్పిస్తారా..? లేక ఈలోపే మంత్రివర్గాన్ని విస్తరించి, ఆర్థిక మంత్రి పోస్టును భర్తీ చేస్తారా..? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ క్యాబినెట్ విస్తరణ లేకపోతే అప్పుడు పరిస్థితేంటనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. నిజంగా అలాంటి పరిస్థితే ఎదురైతే ముఖ్యమం త్రే స్వయంగా బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారని ఆర్థికశాఖ వర్గాలు అబిప్రాయపడ్డాయి. మరోవైపు ఈనెల 17న కేసీఆర్ తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఆ సందర్భంగా మంత్రివర్గాన్ని విస్తరించి.. సస్పెన్స్ కు తెరదించినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.