Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
హైకోర్టు చరిత్రలో తొలిసారి ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులను హైకోర్టు రిజిస్ట్రీ కస్టడీకి తీసుకుంది. తదుపరి కోర్టు విచారణకు హాజరౌతామని ఇద్దరు కార్యదర్శుల నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకున్న తర్వాత వారిద్దరినీ హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ విడదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్లను అసెంబ్లీ నుంచి బహిష్కరణ చెల్లదని వెలువ రించిన తీర్పును అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కార కేసులో రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వి.నరసింహా చార్యులు, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులు శుక్రవారం హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్ రావు ఎదుట హాజరయ్యారు. మీరు అసెంబ్లీ/న్యాయ శాఖ కార్యదర్శులు నరసింహాచార్యులు, నిరంజన్రావ్లేనా.. అని న్యాయమూర్తి అడిగితే వారిద్దరూ అవునని బదులిచ్చారు. వెంటనే హైకోర్టు జ్యుడిషియల్ రిజిష్ట్రార్ను కోర్టుకు రావాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. వారిద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలని, వారి నుంచి హామీ బాండ్లు తీసుకున్న తర్వాత విడుదల చేయాలని హైకోర్టు జ్యుడిషియల్ రిజిష్ట్రార్ను ఆదేశించారు. వారిద్దరినీ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత.. తాము తదుపరి విచారణకు హాజరౌతామని వారిద్దరూ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాక విడుదల చేశారు.
రద్దయిన గత అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారిని ఆరో ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. కోమటిరెడ్డి, సంపత్కుమార్ల బహిష్కరణను రద్దు చెల్లదని హైకోర్టు తీర్పును అనంతరం వారి శాసనసభ్యత్యాలను ఎందుకు పునరుద్ధరించలేదో వివరించాలని, కోర్టు ధిక్కారం కింద మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో కూడా వివరణ ఇవ్వాలని అప్పటి స్పీకర్ను ఆదేశించారు. కావాలనే కోర్టు తీర్పు మధుసూదనాచారి అమలు చేయలేదని, స్పీకర్గా ఉండగా తామిచ్చిన నోటీసును స్వీకరించేందుకు ఆయన నిరాకరించారని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోమటిరెడ్డి, సంపత్లకు ఎమ్మెల్యేల హౌదాలో ఉండగా ఉండే గన్మెన్ లను పునరుద్ధరించాలన్న ఆదేశాల్ని అమలు చేయకపోవ డంతో రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, అప్పటి జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమో రాజేశ్వరి, నల్లగొండ ఎస్పీ ఎ.వి.రంగనాథన్లకు కోర్టు ధిక్కార చట్టం ప్రకారం ఫాం 1 కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటిం చారు. వీరిద్దరూ మార్చి 8న జరిగే విచారణకు స్వయంగా కోర్టుకు హాజరౌతారని భావిస్తున్నామని తెలిపారు.
స్పీకర్ కోర్టు నోటీసును తీసుకోలేదని, ఇదే మాదిరిగా గతంలో మణిపూర్ స్పీకర్ బోరోబాబుసింగ్ చేస్తే.. తమ ముందు హాజరుపరచాలని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల విస్త త ధర్మాసనం కేంద్ర హౌంశాఖకు ఆదేశాలిచ్చిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఇదే కాకుండా మరో రెండు తీర్పులు కూడా ఇదే మాదిరిగా వెలువడ్డాయన్నారు. డీజీపీ విషయంలోనూ ఈ విధంగా చేయవచ్చునన్నారు. ఈ కేసు గతసారి విచారణ సమయంలో 'వాటీజ్ దిస్ నాన్సెన్స్..' అని వ్యాఖ్యానించిన అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు వ్యవహార తీరును ఆయన తప్పుపట్టారు. గతంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ కూడా ఎగతాళిగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపా డేందుకు మాత్రమే తాను పనిచేస్తానని, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహి స్తానని ప్రమాణం చేసినట్లుగానే విధులు నిర్వహిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు. అదనపు ఏజీ, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ఇద్దరూ కనీసం పశ్చాత్తాపాన్ని కూడా వెలిబుచ్చలేదని, వీరి తీరు తీవ్ర ఆక్షేపణీయమని, ఈ అంశంపై తర్వాత చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అవసమైతే సుప్రీంకోర్టుకు నివేదిస్తామని పేర్కొన్నారు. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో నోటీసు అందుకున్న వారంతా కోర్టుకు వచ్చిన తర్వాతే ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల అమలు విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
కోమటిరెడ్డి, సంపత్లను అసెంబ్లీ నుంచి బహిష్కరిం చడం చెల్లదన్న తీర్పు అమలు చేయకపోవడంతో వారిద్ద రూ.. న్యాయ శాఖ/అసెంబ్లీ కార్యదర్శులను, డీజీపీ, అప్పటి గద్వాల ఎస్పీ, నల్లగొండ ఎస్పీలను వ్యక్తిగతంగా ప్రతి వాదుల్ని చేస్తూ కోర్టు ధిక్కారవ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పూర్వం మాదిరిగానే గత విచారణ సమయంలో కూడా ఇద్దరు కార్యదర్శుల తరఫు న్యాయవాదులు కేసు విచారణ వాయిదా వేయాలని కోరాగా న్యాయమూర్తి అంగీకరించ లేదు. ఈ సమయంలో అదనపు ఏజీ రామచందర్రావు ఆవేశంగా.. వాటీజ్ దిస్ నాన్సెన్స్.. అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కార్యదర్శులకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి.. వీరిద్దరినీ కోర్టు విచారణకు హాజరపర్చాలని హైదరాబాద్ నగర పోలీసుల్ని ఆదేశించారు. ఇద్దరు కార్యదర్శులు నేడు స్వయంగా హాజరుకాడంతో పై పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫాం1 కింద జారీ చేసిన నోటీసుకు స్పందన లేకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని న్యాయమూర్తి వివరించారు. ఒక దశలో అదనపు ఏజీకి కూడా న్యాయమూర్తి నోటీసు జారీ చేయబోయారు. అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ లాయర్ వేదుల వెంకట రమణ జోక్యం చేసుకుని కొంత గడువు ఇస్తే అదనపు ఏజీతో మాట్లాడతానని చెప్పడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. విచారణ మార్చి 8కి వాయిదా పడింది.