Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి బీట్ ఆఫీసర్ అడవిలో కాలినడకన తిరుగుతూ అటవీ సంరక్షణను చేపట్టాలని, సిబ్బంది కచ్చితంగా నైట్హాల్ట్ చేయాలని పీసీసీఎఫ్ పీకే ఝా ఆదేశించారు. తెలంగాణ అడవుల్లో ఒక్క చెట్టు కూడా కొట్టొద్దని సీఎం కేసీఆర్ ఆశయమని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. అడవులు, వన్యప్రాణుల రక్షణ కోసం పటిష్ట నిబంధనలతో కొత్త చట్టం వస్తోందని, దానిని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. అన్ని జిల్లాల అటవీ అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ నేరాలను అలవాటుగా చేసుకుని, వ్యవస్థీకృత నేరగాళ్లుగా ముద్రపడ్డ వాళ్ల భరతం పట్టాలని ఆదేశించారు. చట్ట ప్రకారం పర్మిట్లు, లైసెన్స్లతో కలప వ్యాపారం చేసేవారికి, వడ్రంగులకు ఇబ్బందిలేదని, అదే సమయంలో అక్రమంగా వ్యాపారం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో లైసెన్స్లు లేకుండా నడుస్తున్న సా మిల్లులను మూసివేయించే బాధ్యత సంబంధిత అధికారులదే అని నొక్కిచెప్పారు. ప్రతీ సా మిల్లు కూడా అన్ని వివరాలు రికార్డు బుక్ లో నమోదు చేయాలని, అలా జరగని పక్షంలో సంబంధిత అటవీ అధికారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. నెల రోజుల్లో 659 క్యూబిక్ మెట్రిక్ టన్నుల, కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన కలప స్వాధీనం చేసుకున్నట్టు, 701 కేసులు పెట్టి, 486 మందిని అరెస్ట్ చేయటంతో పాటు 11 మందిపై పీడీ యాక్టు మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని విజిలెన్స్ పీసీసీఎఫ్ రఘువీర్ తెలిపారు. అటవీ నేరాల అదుపు ఒక్క రోజుతో తేలేదు కాదని, నిరంతరం దాడులు, తనిఖీలు కొనసాగించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, ఇతర శాఖల సిబ్బంది, ప్రజలను అటవీ నేరాల అదుపుపై స్పందించే చైతన్య వంతులుగా ప్రేరేపించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రొడక్షన్ పీసీసీఎఫ్ పృధ్వీరాజ్, అదనపు పీసీసీఎఫ్లు లోకేశ్ జైస్వాల్, శోభ, స్వర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.