Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మా తండా.. మా రాజ్యం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించిన సంత్ సేవాలాల్ సేవలు మరువలేనివని సంత్ సేవాలాల్ 280వ జయంతి ఉత్సవాల్లో వక్తలు కొనియాడారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ సేవాలాల్ సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకారుడని కొనియాడారు. 18వ శతాబ్ధంలో నవాబులు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారని, మత మార్పిడీలకు వ్యతిరేకంగా ఉద్యమించారని చెప్పారు. జాతి పునర్జీవనానికి, సంస్కృతి పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని ''ఫేర్ ఫరెరో'' నడిపారన్నారు. టీపీఎస్ కన్వీనర్ జి రాములు మాట్లాడుతూ గౌతమబుద్ధుడి అష్టాంగ మార్గాలను ప్రజలకు వివరించి చెప్పాడని, అవరసరమైనప్పుడు జాతీ రక్షణ కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తన జ్ఞానాన్ని సేవలను, త్యాగాలను బంజారాలకు అంకింత చేసిన మహానుభావుడు సంత్సేవాలాల్ అని అభిప్రాయపడ్డారు. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మానాయక్ మాట్లాడుతూ ప్రతి తండాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, మూఢ నమ్మకాలు, మద్య పానియాలు, జంతుబలికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడి చరిత్రను వెలికితీసి పుస్తకంగా తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శ్రీరాంనాయక్, హిమబిందు, భూపతి వెంకటేశ్వర్లు, ఎంవీ రమణ, ఆశయ్య, కిల్లే గోపాల్ తదితరులు పాల్గొన్నారు.