Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేలకొరిగిన మొక్కజొన్న, జొన్న పంటలు
- మార్కెట్లలో తడిసిన పసుపు, కందులు
నవతెలంగాణ- విలేకరులు
జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వడ్లగండ్లూ పడ్డాయి. దీంతో పెద్దఎత్తున మొక్కజొన్న పంట నేలకొరిగింది. మార్కెట్లలో ఆరబెట్టిన పసుపు, కందులు తడిశాయి. ఎర్ర, తెల్ల జొన్నపంటలూ దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్వైర్లు తెగి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప్లూర్లో వడగండ్ల వానకు ఈదురుగాలులు తోడవడంతో మొక్కజొన్న, ఎర్రజొన్న, తెల్లజొన్న పైర్లు పూర్తిగా నేలకొరిగాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డు, కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసిపోయింది. ఆర్మూర్ డివిజన్లోని ఆర్మూర్, ముప్కాల్, కమ్మర్పల్లి, మాక్లూర్లో వర్షం పడగా, నిజామాబాద్, బోధన్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లో బలమైన ఈదురుగాలులతో భారీ నష్టమే మిగిలింది. పట్టణంలోని గంగాభవాని గ్యారేజీ రేకుల షెడ్డు ఎగిరి మీదపడటంతో తోట ప్రవీణ్, నితిన్కు తీవ్ర గాయాలయ్యాయి. బస్టాండ్ ఆవరణలో ఇంటిపై బోర్డింగ్ కుప్పకూలింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న బొంబాయి ఫొటో స్టూడియోలో కంప్యూటర్, పరికరాలు ధ్వంసమయ్యాయి, పట్టణంలోని 9వ వార్డులో వేపచెట్టు విరిగిపడి ఓ విద్యుత్ స్తంభాన్ని నేలకూల్చింది. దీంతో విద్యుత్వైర్లు తెగి ప్రమాదకరంగా మారాయి. గాజులపేటలో సత్యనారాయణకు చెందిన ఇంటి గోడ కూలింది. పది నిమిషాల పాటు బలమైన ఈదురుగాలు బీభత్సాన్ని సృస్టించాయి. మెట్పల్లి మార్కెట్ యార్డులోని సుమారు వెయ్యిక్వింటాళ్ల వరకు పసుపు తడిసిపోయింది. నాణ్యత తగ్గి మద్దతు ధర కూడా రాదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కందులూ సుమారు 100క్వింటాళ్ల వరకు తడిసినట్టు అధికారులు అంచనా వేశారు.
వేంపేట్, చింతల్పేట, చౌలమద్ది అరెపేట్ తదితర గ్రామాల్లో మొక్కజొన్న నేలవాలింది. ఉడికించిన పసుపు తడిసింది. మెట్పల్లి మండల వ్యాప్తంగా సుమారు 500 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలినట్టు అధికారులు గుర్తించారు. కోరుట్లలో రాళ్ల వాన కురిసింది. పట్టణ శివారులోని జాతీయ రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. కోరుట్ల మండలం యెఖీన్పూర్, యూసుఫ్నగర్, వెంకటాపూర్, గుమ్లాపూర్, మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట, రాఘవపేట, సిరిపూర్ , ఇబ్రహీంపట్నం మండలంలో కోమటికొండాపూర్, వర్షకొండ, ఎడ్దండి, వేములకుర్తి, గోధూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో 39 విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. 2 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వెంటనే ట్రాన్స్కో అధికారులు స్పందించి పునరుద్ధరించారు.