Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- కొవ్వొత్తులతో శాంతి ర్యాలీలు
నవతెలంగాణ- విలేకరులు
జమ్మూ కశ్మీర్లో జవాన్లపై ఉగ్రవాదుల బాంబుదాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ దాడిలో ప్రాణం కోల్పోయిన జవాన్లకు నివాళి అర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులు నివాళిగా మౌనం పాటించారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లిలో ఎమ్మెల్మే హరీశ్రావు నివాళి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంగారెడ్డి పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. జహీరాబాద్లో మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు.
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండల కేంద్రంలో ముస్లీం మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, మౌనం పాటించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో అఖిలపక్షం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది.
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల వ్యాప్తంగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యా సంస్థల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. బాలానగర్లో శోభన హనుమాన్ కమాన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు డీవైఎఫ్ఐ మేడ్చల్ కార్యదర్శి ఐ.రాజశేఖర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్ పాండునాయక్, డాక్టర్ రాంసింగ్ల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల ఫొటో పేపర్లను దహనం చేశారు. ఉస్మానియా అస్పత్రిలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కొవ్వొతులు వెలిగించి, జవాన్ల చిత్ర పటాలకు పూలమాలతో నివాళులర్పించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విద్యార్థులు, యువజన సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి మౌనం పాటించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీ కమలాసన్రెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో విద్యార్థులు, కాసిపేటలో యువజన కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కుమురంభీం జిల్లా కేంద్రంలోని శిశుమందిర్లో వీర జవాన్లకు నివాళ్లు అర్పించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో ముస్లిం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని న్యూకిడ్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సాగర్-హైదరాబాద్ రహదారిపై నల్లబ్యాడ్జీలు ధరించి మానవహారం నిర్వహించారు. మిర్యాలగూడలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. మొబైల్ షాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోనూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలోఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. గార్ల మండల కేంద్రంలో ప్రెస్క్లబ్, ఎన్ఎస్ఎస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహరం నిర్వహించారు.