Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇగో చేస్తాం..అగో చేస్తాం..అంటూ పాలకుల దాటవేత
- సుప్రీంకోర్టు ఆదేశాలు బుట్టదాఖలు
- ఐడీకార్డులుండవు..ఈఎస్ఐ, పీఎఫ్ వర్తించవు..
- అడుగడుగునా వేధింపులే
- గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లల్లోని డైలీవేజ్ సిబ్బంది వెతలెన్నో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఇదిగో...అదిగో...ఇగ పర్మినెంట్ అయ్యేపాయే..'అంటూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లల్లో పనిచేసే సిబ్బందిని 33 ఏండ్ల నుంచీ పాలకులు మోసం చేస్తూనే ఉన్నారు. ఏడుగురు ముఖ్యమంత్రులు మారారుగానీ వారి పర్మినెంట్ అంశం మాత్రం పరిష్కారం కాలేదు. అసలే అరకొర వేతనాలు...ఆపై వారికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా వర్తించవు. కనీసం ఐడీకార్డులకు కూడా నోచుకోకుండా ఏజెన్సీలో నిత్యం వేధింపులు ఎదుర్కోవాల్సిన దుస్థితి వారిది. పేరుకే ఆ సిబ్బంది అంతా డైలీవేజ్గానీ...మన ప్రభుత్వం వారిచేత గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లల్లో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నవతెలంగాణ కథనం.
తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 302 ఆశ్రమ పాఠశాలలు, 170 హాస్టళ్లు నడుస్తున్నాయి. వాటిలో పనిచేసే 2,600 మంది సిబ్బంది లక్షా 30 వేల మంది విద్యార్థులకు తమ సేవలను అందిస్తున్నారు. వీరంతా అక్కడ డైలీవేజ్ కింద కుక్, కామాటీ, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్లు, తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. అందులో దాదాపు సగం మంది మహిళా ఉద్యోగులే. వీరిలో 25 ఏండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న వారూ ఉన్నారు. వీరంతా పేరుకే పార్ట్టైమ్ వర్కర్లు గానీ పొద్దస్తమానం పాఠశాలల్లో, హాస్టళ్లలో ఉండాల్సిందే. ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు అక్కడ విధులు నిర్వర్తించాల్సిందే. ఇంత చేసినా వీరికి దక్కుతున్నది అరకొర వేతనాలే. అవీ ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉన్నాయి. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో 85 మందికి రూ. 8,600 చెల్లిస్తున్నారు. అదే ఉట్నూర్ ఏజెన్సీలో 215 మందికి రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రూ.9 వేలు ఇస్తున్నారు. ఇచ్చే ఆ అరకొర వేతనాలను నాన్చి నాన్చి ఇస్తున్నారు. నేటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు నెలల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి.
ఊరించుడే..పర్మినెంట్ చేయరే
ఐదేండ్ల నుంచి పనిచేస్తున్న డైలీవేజ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని 1993 డిసెంబర్ 23న కోట్ల విజయభాస్కర్రెడ్డి ప్రభుత్వం జీవో 212ను జారీ చేసింది. ఆ జీవోను అనుసరించి ఆనేక విభాగాల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వం పర్మినెంట్ చేసింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే వారి పర్మినెంట్ అంశం మాత్రం అటకెక్కింది. పలువురు సిబ్బంది సుప్రీం కోర్టు గడప తొక్కగా...వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని ఆదేశించింది. కోర్టు సూచనలను పాలకులు పెడచెవిన పెట్టారు. అనేక పోరాటాల ఫలితంగా 2008 సెప్టెంబర్ పదో తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గిరిజన పాఠశాలల్లో, హాస్టళ్లల్లో డైలీవేజ్ కింద పనిచేస్తున్నవారిని రెగ్యులర్ చేసి కొత్తగా మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీంతో కలెక్టర్లు ఆశ్రమ పాఠశాలలు, ఆశ్రమాల్లో పనిచేసే సిబ్బంది వివరాలను తెప్పించుకున్నారు. ఉన్నవారికి తోడు కొత్తగా 3255 మంది అవసరమని ఉన్నతాధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ పర్మినెంట్ అంశం బుట్టదాఖలైంది. 2012 మే నెలలో సిబ్బంది అంతా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ను కలువగా..212 జీవో ప్రకారం అర్హులైన వారందర్నీ పర్మినెంట్ చేస్తామని, వేతనాలు పెండింగ్లో ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అదీ నెరవేరలేదు.
ఐడీకార్డులుండవు...సౌకర్యాలు వర్తించవు..
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే ఏ ఒక్క డైలీవేజ్ సిబ్బందికి కూడా సెలవుల డబ్బులు కట్టివ్వడంలేదు. సెలవు ఉంటే ఆరోజుకు పడే వేతనాన్ని కట్చేస్తున్నారు. వేసవిలో పాఠశాలలు, హాస్టళ్లకు సెలవులు ఇచ్చే రోజుల్లో వీరికి జీతం రాదు. వీరిలో ఒక్కరికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి ఏ ఒక్కచట్ట సౌకర్యాలు కూడా దక్కట్లేదు. చివరకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను కూడా ఇవ్వలేదు. టిఫిన్ బాక్సులు కట్టుకుని ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో పోలీసులు ఎదురైతే అన్నం ఎవరికీ? ఎక్కడికి పోతున్నారా? నీకేనా? ఇంకెవరికైనా సద్ది కట్టుకుని పోతున్నవా? అంటూ నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న దుస్థితి నెలకొంది. రాత్రి పూట ఇండ్లకు వెళ్లే సమయంలోనూ ఇలాంటి వేధింపులు నిత్యకృత్యమే.
నాన్చుడు ఇంకెన్నాళ్లు? పర్మినెంట్ చేయాల్సిందే
ప్రతిసారీ చివరి దశలో ఏదో ఒక సాకు చూపి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లల్లో పనిచేసే డైలీ వేజ్ సిబ్బంది పరిన్మెంట్ను నిలిపేస్తు న్నారు. ఇది చాలా అన్యాయం. 25 ఏండ్ల నుంచి ఈ జాబ్పైనే ఆధారపడి బతుకుతున్నవారూ ఉన్నారు. జీవో 212 సవరించి పాతవారినీ, కొత్తవారినీ పర్మినెంట్ చేయాలి. చట్టబద్ధంగా దక్కాల్సిన సౌకర్యాలన్నిం టినీ కల్పించాలి. ఒక జిల్లాలో రూ.3000, మరో జిల్లాలో 8,700 చెల్లించడం దారుణం. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి.
- బి మధు
గిరిజన ఆశ్రమ పాఠశాలలు , హాస్టల్స్ డైలీవేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు