Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఆధారిత నది నుంచి యథేచ్ఛగా తరలింపు
- ఒక ట్రాక్టర్కు అనుమతి.. వెయ్యి ట్రిప్పుల రవాణా
- అధికారులకు భారీగా మామూళ్లు?
- తగ్గుతున్న భూగర్భజలాలు
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
గంటకు యాభై కిలోమీటర్ల వేగం.. ముఖానికి అడ్డుగా మాస్క్.. నెంబరు ప్లేట్లు లేని వాహనాలు.. ప్రతి ఐదు కిలోమీటర్లకు నిఘాలో ఓ వ్యక్తి.. ఇదీ ఇసుకచోరులు అనుస రిస్తున్న పద్ధతి. క్షణాల్లోనే ట్రాలీలకు ట్రాలీలు నింపేస్తున్న మాఫియా నదుల నుంచి పట్టణాలకు ఇసుకను యథేచ్ఛగా తరలించేస్తున్నది. ఫలితంగా ఉమ్మడి పాల మూరు జిల్లావ్యాప్తంగా విస్తరించిన దుందుబీ నది నుంచి కొంతకాలంగా ఇసుక మాఫియా జోరం దుకున్న దరిమిలా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. వందల ఎకరాల్లో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇసుక అక్రమ రవాణాకు కేరాఫ్గా మారింది. ఒకప్పుడు రూ.2 వేల నుంచి 3 వేల వరకు పలికిన ట్రాక్టర్ ఇసుక ధర ప్రస్తుతం రూ.7 వేలకుపైగా చేరింది. కొన్నిరోజుల క్రితం టిప్పర్ ఇసుక రూ.5వేల నుంచి రూ.10వేలు పలకగా, నేడు రూ.40వేల నుంచి రూ.70 వేలకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా నదీ పరివాహక ప్రాంతాల నుంచి యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. రాత్రి వేళ్లలో రైతుల పొలాల్లో ఇసుకను డంపుచేసి, గుట్టుగా తరలిస్తున్నారు. ట్రాక్టర్కు అనుమతి తీసుకొని రోజుకు వెయ్యి ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ వారికి మైనింగ్శాఖ అనుమతులున్నాయని బుకాయి స్తున్నారు. అయితే ఒక్క ట్రాక్టర్కూ నెంబర్ ప్లేట్ లేకుండా నడుస్తున్నాయంటేనే దందా ఏ మేర కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టడంతో పాటు చోటా మోటా నాయకుల నుంచి పెద్దస్థాయి నేతల వరకూ డబ్బు చేరు తోందని బహిరంగ విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
20 నుంచి 5 ఫీట్లకు జలాలు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దుందుబీనది 75 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, 40 కిలోమీటర్ల పరిధిలో ఇసుకను తోడుతున్నారు. ఆర్నెళ్ల కిందట 20 ఫీట్ల నీళ్లుండగా ఇసుక తవ్వకాల వల్ల ప్రస్తుతం 5 ఫీట్లకు పడిపోయింది. కోయిల్సాగర్లో 6 ఫీట్ల వరకుంటే ఇప్పడది పూర్తిగా ఎండిపోయింది.
వనపర్తి జిల్లా మదనాపురం ఊరవాగులో 17 ఫీట్ల నీళ్లుండగా ఇప్పుడు వెలవెలబోతోంది. ఇసుక తరలింపు వల్ల పరివాహక గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పెబ్బేరు మండలం గుర్రంగడ్డ, దేవరకద్ర, బాలానగర్తో పాటు బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టు కాలువల కింద ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు.
ఎండిపోతున్న పంటలు..
దాసర్లపల్లి గ్రామ సమీపంలోని దుందుబీనదిలో ఇసుక ఉన్నంతకాలం భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఆర్నెల్ల నుంచి ఇసుక తోడేస్తున్న కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. గ్రామానికి జీవనాధారమైన నది ఆయకట్టు 2700 ఎకరాలు. వరి, వేరుశనగ, ఆముదం పంటలు వేస్తూ ఎస్సీ, బీసీలు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ప్రతిరోజూ ఇక్కడ్నుంచి సుమారు వెయ్యి ట్రాక్టర్ల ఇసుకను అచ్చంపేట, నాగర్కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇసుక తగ్గడం వల్ల వందల ఎకరాల్లో సాగు ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని పంటలు ఎండిపోయి ఆ గ్రామ రైతుల జీవనోపాధిపై దెబ్బపడనుంది.
మాకు 20 ఎకరాల భూమి ఉంది. కష్టమొచ్చినా.. కన్నీళ్లొచ్చినా ఊరిని వదిలి పెట్టలేదు. దుందుబీ నదిలో నీళ్లున్నంతకాలం మాకు కన్నీళ్లు రావనుకున్నాం. కానీ నది నుంచి ఇసుక తీయడం వల్ల మా పొలాలెండుతున్నాయి. ఇప్పటికే రెండున్నర ఎకరాలు ఎండిపోయింది. ఇలాగే తీస్తే మున్ముందు తాగునీరు కూడా దొరకదు.
- శ్రీనివాస్రెడ్డి, దాసర్లపల్లి
వాగొస్తే రెండేండ్లు పంటలు
సరైన వర్షాల్లేకున్నా ఇసుకలో ఫిల్టర్పాయింట్లు వేస్తే నీరొచ్చేది. ఒక్క ఏడాది వాగొస్తే రెండేండ్లు పంటలు పండేవి. ఇసుక తీయడం వల్ల మా పంట పొలాలకు సాగు నీరు రావడం లేదు. బోర్లు ఎండిపోతున్నాయి. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక తరలిస్తూ మా బతుకులపై మట్టి కొడుతున్నారు.
-లక్ష్మయ్య, దాసర్లపల్లి
వారికి అనుమతులున్నాయి
దాసర్లపల్లి దగ్గర తీస్తున్న ఇసుకకు అనుమతులున్నాయి. ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇసుకను తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు.
- సాయిశేఖర్, నాగర్కర్నూల్ ఎస్పీ