Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి
- సీఎంకు తెలంగాణ రైతు సంఘం లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా పసుపు, ఎర్రొజొన్నలకు మద్దతు ధర నిర్ణయించాలని, ఆ ధరకు ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు సంఘం ప్రతినిధుల బృందం ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. జంగారెడ్డి, కార్యదర్శి టి. సాగర్, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు లేఖ రాశారు. శుక్రవారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఎం. గంగాధరప్ప, పెద్ది వెంకట్రాములు, రమేష్బాబు, వెంకటేశ్లతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రం మార్కెట్ను ఈ నెల 14న పరిశీలించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్వింటాల్ పసుపుకు రూ. 15వేలు, ఎర్రజొన్నలకు రూ.3500చొప్పున మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. ఈ నెల 13,14 తేదీల్లో 40వేల క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్కు వచ్చిందన్నారు. ఇంకా 7లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. కమీషన్ ఏజెంట్లు ఇష్టానుసారం ధరలు నిర్ణయించి రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. గ్రేడింగ్ సిస్టమ్ లేకపోవడం, టెండర్ సిస్టమ్ వల్ల కొనుగోలుదారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని విమర్శించారు. ఒకే నాణ్యతతో కూడిన పసుపుకు కూడా వేర్వేరు ధరలు నిర్ణయించడం వల్ల ప్రతి రోజు రైతులు రూ.3 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 1.25 లక్షల ఎకరాల్లో పసుపు సాగు చేశారని. 2.30లక్షల టన్నులు ఉత్పత్తి చెస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నల ఉత్పత్తి అధికంగా ఉందన్నారు.హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ జొన్నలను విత్తనానికి వినియోగిస్తారని చెప్పారు.