Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వరుసగా ప్రతిపక్ష పార్టీలోకి క్యూ కడుతున్నారు. వారి బాటలోనే తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రముఖ వ్యాపార వేత్త దాసరి జై రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేసి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దగ్గుబాటి వెంటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్లతో కలిసి శుక్రవారం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నూటికి నూరుపాళ్లు విజయం సాధించడం ఖాయమని అన్నారు. మంచిరోజు చూసుకుని త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరతానని చెప్పారు. తాను పోటీ చేసినా, చేయకపోయినా వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయమని తెలిపారు. జగన్తో భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, కేవలం పార్టీ విషయాలు, ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై చర్చించినట్టు వెల్లడించారు. గత కొంత కాలంగా జగన్కు వస్తున్న ప్రజాధరణను గమనించానని, ప్రస్తుతం ఏపీలో ప్రభంజనంలా వైఎస్ఆర్సీపీ గాలి వీస్తుందన్నారు. జగన్ మాట ఇస్తే దానిమీద నిలబడతారనే నమ్మకం ఉందని, ఆయన ఇస్తున్న హామీలన్నీ అమలు సాధ్యమైనవేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుజాతిని అవమానించేలా చంద్రబాబు పాలన సాగుతోందని పరోక్షంగా చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. టీడీపీి పాలనలో జరుగుతున్న అవినీతిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపనికి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర జీడీపీలో టీడీపీ నేతలే సొంతానికి లాక్కుంటే ప్రజలకు మిగిలేదేముంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు ఆశించిన పాలన లేదని, ఎన్ని రకాలుగా దోచుకోవచ్చనే విధంగా ప్రజాప్రతినిధులు తయారయ్యారని విమర్శించారు. ప్రతి ఎమ్మెల్యే మొదటి రెండేండ్లలోనే రూ.50 నుంచి రూ.200 కోట్ల వరకు సంపాదించారన్నారు. చంద్రబాబు పాలనలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉందని, అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. 2001 నుంచే టీడీపీకి దూరంగా ఉంటున్నానని, రాజకీయంగా చంద్రబాబు తనను నిరాశపరిచారని చెప్పుకొచ్చారు. 1999లో గన్నవరం అసెంబ్లీ, విజయవాడ పార్లమెంటు స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు చాలా బాగున్నాయని, అధికారంలోకి రాగానే అవన్నీ అమలు చేస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నానని చెప్పారు. టీడీపీకి 30 ఏండ్లపాటు సేవ చేశానని, ఏనాడు ఒక్క రూపాయి కూడా ఆశించలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ఎంతో సాయం చేశానని తెలిపారు.