Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ డిమాండ్
- ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వెలాసిటీ జూనియర్ కాలేజీని మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ నేతృత్వంలో శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ కార్పొరేట్ కాలేజీ పేరుతో రెండేండ్ల కింద వెలాసిటీ ప్రారంభమైందని కోట రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.2.50 లక్షల ఫీజు వసూలు చేసిందని పేర్కొన్నారు. మాదాపూర్లో 5, అంబర్పేట్లో 1, నల్లకుంటలో 1, సికింద్రాబాద్లో 1, కూకట్పల్లిలో 1, ఎస్ఆర్ నగర్లో 1, దిల్సుక్నగర్లో 1 మొత్తం 11 కాలేజీలను స్థాపించిందని తెలిపారు. గత విద్యాసంవత్సరం ప్రథమ విద్యాసంవత్సరం తరగతులు సక్రమంగానే తరగతులు జరిగాయని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ నుంచి జీతాలు చెల్లించకపోవడంతో అధ్యాపకులు మానేశారని తెలిపారు. దీంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు జరగడం లేదని పేర్కొన్నారు. సిలబస్ పూర్తికాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వెలాసిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో మాదాపూర్, ఎస్ఆర్ నగర్ బ్రాంచీలకు తాళాలు వేసిందని పేర్కొన్నారు. దీంతో ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్కు వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థులను మోసం చేస్తున్న వెలాసిటీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెలాసిటీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు బైఠాయించారని తెలిపారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను కలిసి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. వెలాసిటీ కాలేజీని మూసివేయాలనీ, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి జావీద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశ్ కరత్, విజేత, నాయకులు బాబు, శంకర్, తల్లిదండ్రులు పూజిత, కరుణ, వినిత, భాస్కర్, లక్ష్మి, సురేష్ పాల్గొన్నారు.