Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడికి బడి, గుడికి గుడి కట్టివ్వాలి
- పనులను అడ్డుకున్న మల్లన్నసాగర్ నిర్వాసితులు
నవతెలంగాణ- తొగుట
మల్లన్నసాగర్ నిర్మాణంలో పోతున్న తమ ఊరును పునరావాస కల్పనలో భాగంగా ఎక్కడైతే కొత్త గ్రామాన్ని నిర్మిస్తారో అక్కడ పాత ఊరు పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయాలనీ లక్ష్మాపూర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఎవరి వాటా వారిపేరు మీద చేసివ్వాలనీ, గుడికి గుడి, బడికి బడి, గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాల్, శ్మశాన వాటిక నిర్మాణాలను చేపట్టాలనీ కోరారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లక్ష్మాపూర్లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో నిర్వాసితులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో భూనిర్వాసితులకు రిజర్వేషన్లివ్వాలన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని కోరారు. భూములు కోల్పోతున్న రైతులకు మరణించే వరకు రూ.5 వేల జీవన భృతి ఇవ్వాలన్నారు. ముంపు గ్రామాల నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో కల్పించే గ్రూప్-2, 3 క్యాడర్ ఉద్యోగాలను అర్హులైన ముంపు గ్రామాల్లో నిరుద్యోగులతోనే భర్తీ చేయాలన్నారు. ముట్రాజ్ పల్లిలో నిర్మించి ఇచ్చే ప్రతి డబుల్ బెడ్ రూమ్ ఇంటికీ ప్రహరీ కట్టివ్వాల ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.