Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల పోషకాహార లోపంపై ప్రభావం
- వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే నియంత్రణ
- అశ్రద్ధ చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవు
- ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బహిరంగ మల, మూత్ర విసర్జన చేయడం, చెప్పులు తొడుక్కోకుండా తిరగడం, ఆడుకోవడం, భోజనం చేసే ముందు, ఆ తర్వాత చేతులు శుభ్రపర్చుకోకపోవడం వల్ల తరచూ పిల్లలు కడపునొప్పి, విరేచనాల బారిన పడుతుం టారు. దీనికి కారణం నులిపురుగులు. చిన్నారుల పొట్టలో ఏండ్ల తరబడి తిష్టవేసి, పోషకాలను హరిస్తూ, ఆరోగ్యాన్ని చెడగొట్టే నులి పురుగులతో జాగ్రత్తలు తప్పనిసరని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ముందు జాగ్రత్తలు తీసుకోక పోయినా ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. 'భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వా త చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బహిరంగ ప్రదే శాల్లో మలవిసర్జన చేయొద్దు. పండ్లు, కూరగాయలను శభ్రం చేసి తినాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఆరుబయట మలవిసర్జనకు వెళ్లరాదు. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని తినరాదు' అని వారు సూచిస్తున్నారు. ఇలాంటి రుగ్మతల నివారణకు ప్రపం చ ఆరోగ్య సంస్థ, భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం 19వ తేదీని నులి పురుగుల నివారణ దినంగా ప్రకటించారు. చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నులిపురుగుల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో 0-19 ఏండ్ల వయస్సున్న వారికి నులి పురుగుల నివారణ మందులను అందించే కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఒకే సారి నిర్వహిస్తున్నది. తద్వారా చిన్నారుల్లోని పురుగులను నివారించి, వాటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అల్బెండజోల్ మాత్రలను మంగళవారం చిన్నారులకు వేశారు..
నులి పురుగులు అంటే..
పిల్లల్లో సాధారణంగా మూడు రకాల క్రీములు ఏర్పడతాయి. అవి ఏలిక పాములు, నులి పురుగులు, కొంకి పురుగులు. వీటిలో నులిపురుగులు మానవుల్లో పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. ఇవి పిల్లలు ఆరుబయట వట్టి కాళ్లతో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్ర పరిసరాలతో పిల్లలను చేరతాయి. ఇవి కలిగిన చిన్నారులు నులిపురగుల గుడ్లు కలిగిన మలంతో నేలను కలుషితం చేస్తారు. ఈ గుడ్లు నేలలో లార్వాగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఆరుబయట మట్టిని తగలడం లేదా నులిపురుగుల గుడ్లు చేరిన ఆహారం తీసుకోవడం వల్ల ఇతర పిల్లల కడుపులోకి వెళ్లి అక్కడ వృద్ధి చెందడం మొదలు పెట్టి అక్కడే తీష్టవేస్తాయి. 19 ఏండ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయి.
అనారోగ్యం దరిచేరినట్టే..
నులిపురుగులు కలిగిన చిన్నారులు తాము తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులు పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి వివిధ రోగాల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. దీంతో పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం బారిన పడతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు బయటపడతాయి. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమేగాక వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
8 లక్షల మాత్రల పంపిణీ
1-19 ఏండ్ల వయస్సు గల చిన్నారులకు రాష్ట్రంలో మంగళవారం తొలిరోజు 30 లక్షల ఆల్బెండజోల్ (400 మిల్లీ గ్రాములు) మాత్రలను వేసినట్టు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 1-2 ఏండ్ల వయసున్న పిల్లలు అరమాత్ర, 2-19 ఏండ్లు ఉన్నవారికి పూర్తి మాత్రను వేయించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తర్వాత ఈ మాత్రలను చప్పరించి లేదా నమిలి మింగే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.