Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లపై ఉంటున్న రైతులు
- పట్టించుకోని మార్క్ఫెడ్, డీసీఎంఎస్ అధికారులు
నవతెలంగాణ- తాండూరు
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కందుల కొనుగోలు కేంద్రాన్ని మూసేయడంతో రైతులు పంటతో రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కంది కొనుగోలు కేంద్రానికి రైతులు పంటను తెస్తూనే ఉన్నారు. అయినా అధికారులు కేంద్రాన్ని మూసేశారు. ఈనెల 16వ తేదీ నుంచి కంది కొనుగోలు కేంద్రాన్ని మూసేసినట్టు బోర్డు ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 25,897 క్వింటాళ్ల కందులను 2,300 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రంలో కందులు క్వింటాకు రూ.5,675 చెల్లిస్తున్నారు. బయట మార్కెట్తో తక్కువ ధర పలుకుతుండటంతో రైతులు కేంద్రానికే పంటను తీసుకొస్తున్నారు. కానీ, అధికారులు 16వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాన్ని మూసేశారు. ఈ విషయం తెలియక గ్రామాల నుంచి ట్రాక్టర్లలో కందులతో వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా సుమారు 8వేల బస్తాల కందులు కాంటా కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాన్ని తెరవాలని కోరుతున్నారు.
మాకు న్యాయం చేయాలి :
రైతు రాములు
'తాండూరులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మళ్లీ తెరచి రైతులకు న్యాయం చేయాలి. పంటను తీసుకొచ్చి రోడ్లపై ఉంటున్నాం. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి.'
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..:
తాండూరు డీసీఎంఎస్ మేనేజర్ షరీఫ్
'తాండూరులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మూసేశాం. రైతులు కేంద్రాన్ని తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు వస్తేనే కేంద్రాన్ని కొనసాగిస్తాం.'