Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైషే దాడి నేపథ్యంలో కమాండోలకు శిక్షణ
- కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అప్డేట్
- పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
జమ్మూకాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రపోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ జైషేమహ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటనలాంటిది తమకు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా చర్చించినట్టు తెలిసింది. గతంలో గోకుల్చాట్, లుంబినీ పార్క్, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో దాదాపు వందమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు లష్కరేతోయిబా, ఇండియన్ ముజాహిదీన్, జైషే మహ్మద్వంటి ఉగ్రవాద సంస్థలు కారణమయ్యాయి. చివరికి రాష్ట్ర టాస్క్ఫోర్సు కార్యాలయంపై బంగ్లాదేశ్కు చెందిన హర్కతుల్ జిహాదీ ఇస్లామీ(హుజీ) సంస్థ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆ రోజు టాస్క్ఫోర్సు కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
1997లో పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాది జునైద్ ఏకంగా నాలుగు కిలోల ఆర్డీఎక్స్తో హైదరాబాద్లో తిష్టవేసి గణేష్ నిమజ్జనోత్సవం రోజున పేలుళ్లకు కుట్ర పన్నగా, కేంద్ర ఐబీ విభాగం సకాలంలో అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్ర పోలీసు అధికారులకు జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి ఆందోళన కలిగించింది. దేశాన్ని అస్థిర పరచాలనే ఇటువంటి ఉగ్రవాద చర్యలు కేవలం జమ్మూకాశ్మీర్కే పరిమితం అవుతాయని చెప్పలేమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అన్నారు.
జమ్మూకాశ్మీర్లో కేవలం సాయుధ బలగాలు, ఆర్మీని టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు అదే విధానాన్ని ఇక్కడ జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. గత నాలుగున్నరేండ్ల కాలంలో ఇక్కడ ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, విధ్వంసాలు చోటుచేసుకోనప్పటికీ, చాపకింద నీరులా ఇస్లామిక్స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు ఆకర్షితులైన యువత కదలికలు, ఎన్ఐఏ అధికారులు గుర్తించి వారిని పట్టుకోవడంలాంటివి జరిగాయి. అందువల్ల జమ్మూకాశ్మీర్లో తాజా ఘటన నుంచి ఇక్కడి యాంటీ టెర్రరిస్ట్ కమాండో విభాగం ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పాఠాలు నేర్చుకోవలసి ఉన్నదని అధికారులు గుర్తించారు. 2008లో ముంబయిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి చేసిన మారణకాండ అనంతరం ఎన్ఎస్జీ తరహాలో అక్టోపస్ విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ విభాగానికి ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నంలో ట్రైనింగ్ అకాడమీని నెలకొలిపి, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆక్టోపస్లోని ప్రతి కమాండోకు పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్తో పాటు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కొత్తకొత్త ఎత్తుగడలు, వాటి పర్యవసానాలపై ఎప్పటికప్పుడు అవగాహన తరగతులు, డెమో క్లాస్లను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే పలు ఆధునిక ఆయుధాలను ఆక్టోపస్ విభాగానికి సమకూర్చిన అధికారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకునే ఉగ్రవాద కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంటెలిజెన్షియాపైనే ఆధారపడకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్పైనా నిశితంగా దృష్టిని సారించాలని, అందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను కఠినంగా అణచివేయడంలో టెక్నాలజీ కంటే ఎక్కువగా వేగుల ద్వారా వచ్చిన సమాచారంతోటే మంచి ఫలితాలను రాబట్టగలిగామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదే విధానాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ అనుసరించకపోతే ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్లో దాదపు ఐదేండ్ల క్రితం సీఆర్పీఎఫ్ బలగాలపై మాటు వేసి మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో దాదాపు 70 మందికి పైగా జవాన్లు మరణించారని, అది కూడా దాదాపుగా వాహనాల కాన్వారుపైనే జరిగిందని మరో ఉన్నతాధికారి గుర్తు చేశారు.