Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2.50కోట్ల ఆస్తి నష్టం
నవతెలంగాణ- సంస్థాన్నారాయణపురం
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబాయితండా గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీరామగిరి స్పిన్నింగ్ మిల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో షార్ట్సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. చౌటుప్పల్లోని అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. మంగళవారం ఉదయం ఉమ్మడి నల్లగొండ జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.యజ్ఞనారాయణ, యాదాద్రి భువనగిరి జిల్లా అసిస్టెంట్ అధికారి వి.అశోక్ మిల్లును సందర్శించారు. స్పిన్నింగ్ మిల్లు జనరల్ మేనేజర్ నాగేశ్వర్రావుతో మాట్లాడారు. ఈ అగ్ని ప్రమాదం సింప్లెక్స్ డిపార్టుమెంటులో జరిగిందన్నారుజ దారం తీసేందుకు నిల్వ ఉంచిన ముడి సరుకు (జిన్నింగ్ పత్తి) కాలిపోయిందనీ, దాని విలువ విలువ రూ.50లక్షలు ఉంటుందనీ చెప్పారు. రూ.75లక్షల విలువైన 5 సింప్లెక్స్ మిషన్లు, 1 ఆర్ఎస్డీ మిషన్ కాలిపోయాయన్నారు. మొత్తంగా రూ.2.50కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పారు. సింప్ల్లెక్స్ డిపార్టుమెంట్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.
విద్యుత్ సరఫరాలో నాణ్యతాలోపం
శ్రీరామ స్పిన్నింగ్ మిల్లును 2009లో ప్రారంభించారు. 10 ఏండ్లు పూర్తి కావస్తుంనందున ఆ మిషన్లలో నాణ్యత లోపించింది. విద్యుత్ సరఫరా వైర్లు నాణ్యతాలోపంగా ఉండటం, ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడు వుండటంతో షార్ట్సర్క్యూట్ సంభంవించి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. కంపెనీలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన అగ్నిమాపక యంత్రాలు సరిగా పనిచేయడం లేదన్నారు. మొత్తం 270మంది కార్మికులు 3 విడుతలుగా విధులు నిర్వర్తిస్తుంటారు. కార్మికులకు తగిన భద్రత కూడా లేదనే విమర్శలు ఉన్నాయి. స్పిన్నింగ్ మిల్లులోని ప్రతి డిపార్డుమెంట్లో సీసీ కెమెరాలు వున్నప్పటికీ ప్రమాదం జరిగిన సెక్షన్ ఫుటేజ్ని చూపించకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.