Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధులను బహిష్కరించిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు
- జిల్లాల్లో, హైదరాబాద్లో ప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె రెండో రోజు కూడా విజయవంతమైంది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. హైదరాబాద్లో, జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 'సేవ్ బీఎస్ఎ న్ఎల్...సేవ్ బీఎస్ఎన్ఎల్', '4జీ స్పెక్టమ్ను వెంటనే కేటా యించాలి' అంటూ నినదించారు. హైదరాబాద్లో టెలిఫోన్ భవన్, బీఎస్ఎన్ఎల్ భవన్ల వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో జాక్ చైర్మెన్ సీహెచ్. సత్యనారాయణరెడ్డి, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి. మోహన్రెడ్డి మాట్లాడుతూ... బీఎస్ఎన్ఎల్కు వెంటనే 4జీ స్పెక్ట్రమ్ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. వరుసగా రెండో రోజు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సోయి లేన్నట్టుగా ఉండటం, చర్చలకు పిలువకపోవడం దారుణ మన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న బీఎస్ ఎన్ఎల్ పట్ల పాలకులు అనుసరిస్తున్న తీరు సరిగాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే ధోరణితో ఉంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంస్థను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి రాజమౌళి, ఎస్ఎమ్ఏ రాష్ట్ర కార్యదర్శి జి.రమేష్, బీఎస్ఎన్ఎన్ఎల్ ఈయూ రాష్ట్ర నాయకులు ఓంప్రకాశ్జైశ్వాల్, సాంబశివరావు, ఏఐజీఈటీఓఏ నాయకులు జి.వీరభద్రరావు, ఏఐబీఎస్ఎన్ఎల్ఈఏ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఆయా జిల్లాల్లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీపీఐ(ఎం) నాయకులు మద్దతు ప్రకటించారు. రెండో రోజు సమ్మెలో ఏడువేల మందికిపైగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు పాల్గొన్నారని యూనియన్ నాయకులు తెలిపారు.