Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డిని విచారించిన ఈడీ
- నేడు కూడా కొనసాగనున్న విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కలకలం రేపిన ఓటుకు నోటు కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం విచారించారు. దాదాపు ఎనిమిది గంటలకు పైగా సాగిన సుదీర్ఘ విచారణలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి పలు ప్రశ్నలను ఈడీ అధికారులు.. రేవంత్పై సంధించారని తెలిసింది. ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రేవంత్రెడ్డిని మధ్యాహ్నం ఒక గంట పాటు భోజన విరామం మాత్రమే వదిలి రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. నాలుగేండ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డిని ఏ1 ముద్దాయిగా ఏసీబీ అధికారులు చేర్చిన విషయం తెలిసిందే. అప్పటి తమ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డి గెలుపునకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కోసం రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీకి రేవంత్రెడ్డి పట్టుబడ్డారు. ఈ కేసులో టీడీపీ నాయకులు సెబాస్టియన్, ఉదరుసింహా, జెరుసలెం మత్తయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలను నిందితులుగా ఈ కేసులో ఏసీబీ చేర్చింది. కాగా స్టీఫెన్సన్ ఓటును ఖరీదు చేయడానికి ఇవ్వజూపిన 50 లక్షలను హవాలా ద్వారా సమకూర్చారని ఏసీబీ తన విచారణలో ఒక నిర్ధారణకు రావడం, దీనిపై విచారణ జరుపాలని ఈడీని ఏసీబీ కోరిన నేపథ్యంలో తాజాగా రేవంత్ను విచారిస్తున్నారు. ఇప్పటివరకు వేం నరేందర్రెడ్డి, అతని కుమారుడు కృష్ణ, ఉదరుసింహాలను ఈడీ విచారించింది. రేవంత్ను విచారిస్తున్న ఈడీ అధికారులు అంతకుముందు రాష్ట్ర ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, విచారణ పూర్తయ్యాక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారని తెలిసింది.
అలాగే గతంలో రేవంత్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాలు, వారి నివేదికలను కూడా తమ విచారణలో ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా తమకు అవసరమైన సమాచారం కోసం ఏసీబీ, ఐటీ అధికారులను కూడా తమ కార్యాలయానికి పిలిపించుకుని ఈడీ సాయం తీసుకున్నదని తెలుస్తోంది. ముఖ్యంగా స్టీఫెన్సన్కు సమకూర్చిన రూ. 50 లక్షలు ఎక్కడివి ? ఎవరు ఇచ్చారు ? ఎందుకోసం ఇచ్చారు ? మొదలైన కోణాలలోనే ఎక్కువగా రేవంత్ విచారణ సాగినట్టు తెలిసింది. అంతేగాక ఈ డబ్బులను మీరే ఇవ్వాలని ముందుకు వచ్చారా ? లేక దీని వెనుక ఎవరిదైనా ప్రోద్బలం ఉందా అనే కోణంలోనూ ఈడీ అధికారుల ప్రశ్నలు సాగాయని సమాచారం. రేవంత్ను ప్రశ్నిస్తూ, ఆయన ఇచ్చిన సమాధానాలను తమ కార్యాలయంలోనే అందుబాటులో ఉన్న ఏసీబీ, ఐటీ అధికారులతో మాట్లాడి పోల్చి చూసుకుంటూ తమ విచారణను ఈడీ అధికారులు సాగించారని తెలియవచ్చింది. స్టీఫెన్సన్ ఓటు కోసం మొత్తం నాలుగు కోట్ల రూపాయల వరకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయని, అందులో అడ్వాన్స్గా యాభై లక్షలు ఇచ్చారనే ఏసీబీ తన విచారణలో తేల్చిన అంశాన్ని ఎక్కువగా తమ విచారణలో ఉపయోగించుకున్నారని తెలిసింది.
అయితే రేవంత్రెడ్డిపై ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు దాదాపు ఎనిమిది గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయనను ఇంటికి వెళ్లడానికి అనుమతించిన ఈడీ అధికారులు బుధవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. ఓటుకు నోటు కేసులో అత్యంత కీలకంగా మారిన రూ.50 లక్షల డబ్బులు వ్యవహారం ఈడీ విచారణలో ఎక్కడి నుంచి ఎటువైపు మారుతుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధించిన వాయిస్ రికార్డుపై ఇప్పటికే సుప్రీంకోర్టులోనూ విచారణ సాగుతుండగా, రేవంత్ ఇతరులపై ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో దాదాపు 30 మార్లు చంద్రబాబు ప్రస్తావన ఉండటం వంటి కారణాలను బేరీజు వేస్తూ ఈడీ దర్యాప్తు సైతం ఆ దిశగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ బుధవారం రెండోరోజు కూడా రేవంత్ను విచారించనున్న ఈడీ అధికారులు చివరికి హవాలా ద్వారా యాభై లక్షలు వచ్చాయా ? అయితే అవి ఏ విధంగా వచ్చాయి ? ఎవరు సమకూర్చారన్న కోణంలో ఎలాంటి నిజాలు వెలికి తీస్తారో అనే ఉత్కంఠ అన్ని వర్గాలలో నెలకొంది.