Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయంలోకి వెళ్లకుండా అడ్డగింత
- ఆందోళనతో వెనక్కి తగ్గిన ఆలయ కమిటీ
నవతెలంగాణ-నిడమనూరు
దళిత సర్పంచ్ను, గ్రామ దళితులను దేవాలయంలోకి వెళ్లనీయకుండా పెత్తందారులు అడ్డుకున్నారు. దళితుల ఆందోళన తో ఆలయ కమిటీ వెనక్కి తగ్గింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్లో నూతనంగా రామాలయం నిర్మాణం కోసం గ్రామస్తులు చందాలు వేసుకున్నారు. తామూ శక్తిమేర చందాలిస్తానమి గ్రామంలోని దళి తులు సైతం ముందుకొచ్చారు. కానీ దళితుల డబ్బులు తమకొద్దం టూ గ్రామస్తులు నిరాకరించారు. మంగళవారం ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరగగా, గ్రామ సర్పంచ్ దాసరి అడివయ్యను దళితుడనే కారణంతో ఆలయంలోకి రానివ్వకుండా అవమానించారు. గ్రామంలో మొత్తం 150 దళిత కుటుంబాలు తీవ్ర మనో వేదనకు గురై దళిత సంఘాలను ఆశ్రయించాయి. దీంతో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దేవాలయ కమిటీ చైర్మెన్ బొల్లం సైదులు దళితుల పట్ల వివక్ష చూపుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ ఆరీఫ్ పూజారులకు, ఆలయ కమిటీ వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలంతా సమానమేనని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించడంతో ఆలయ ప్రవేశం కల్పించారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మడుపు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, మంద శ్రీను పాల్గొన్నారు.