Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది సర్కారే కదా : హైకోర్టు
హైదరాబాద్ : అగ్నిప్రమాదం జరిగితే నివారణ చర్యలు తీసుకోనప్పుడు ఎగ్జిబిషన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఈ ప్రమాదంలో ఎవరి ప్రాణాలు ఏమీ కాలేదని చెప్పి ఊపిరిపీల్చుకుంటే ఎలా? ప్రాణనష్టం లేదనిచెప్పి అనుమతులు తీసుకోకుండానే తిరిగి ఎగ్జిబిషన్ను ఎలా ప్రారంభిస్తారు? ఎగ్జిబిషన్ సొసైటీయే చట్టాన్ని అమలు చేయకపోతే ఎలా? ప్రజల ప్రాణాల్ని ప్రభుత్వమే కాపాడాలి కదా?.. అని హైకోర్టు తెలంగాణ సర్కార్ను ప్రశ్నలతో ముంచెత్తింది. అగ్నిప్రమాదాల నివారణ/ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్ని రేపే (బుధవారం) వివరించండి.. అని ఆదేశించింది. ఇరవైనాలుగు గంటల సమయంలోనే వివరాలు కోరితే ఎలాగని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ శరత్ అనగానే హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అగ్నిమాపక అనుమతులు లేకుండానే ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కారణమైన దాని నిర్వాహకుల్ని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ లాయర్ ఖాజా ఐజాజుద్దీన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. అగ్నిప్రమాదాల నివారణకు చట్ట ప్రకారం అనుమతులు పొందకుండానే ఎగ్జిబిషన్ను నిర్వహించేందుకు ఎలా అనుమతి ఇచ్చారని తెలంగాణ సర్కార్ను హైకోర్టు నిలదీసింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎగ్జిబిషన్ను తిరిగి ప్రారంభించేందుకు ఏవిధంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ఏమీ కాలేదని, ప్రజల ప్రాణాలకు ప్రభుత్వమే రక్షణగా ఉండాలన్న విషయాన్ని మరిచిపోరాదని సూచన చేసింది. ఎగ్జిబిషన్కు ఎన్వోసీ విధిగా తీసుకోవాలన్న నిబంధనను ఉల్లంఘించారని, సొసైటీకి మంత్రి ఈటల రాజేందర్ చైర్మెన్గా ఉన్నందునే చట్ట నిబంధనల్ని సొసైటీ ఇష్టానుసారంగా ఉల్లంఘించిందని పిటిషనర్ వాదించారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది.
చిన్నపాటి తప్పులకు జైలుశిక్షనా..?
చిన్నపాటి తప్పులకు జైలు శిక్షలు విధించడం సబబుకాదని హైకోర్టు పేర్కొంది. వాహనం నడిపేప్పుడు సెల్ఫోన్ మాట్లాడినందుకు నాలుగు రోజులపాటు కింది కోర్టు జైలు శిక్ష విధించడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సైబరాబాద్ నాలుగో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విధించిన శిక్షను సమాజ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సమాజలో ఆ వ్యక్తి దోషిగా నిలుస్తాడని, అతని కుటుంబం వేదనకు గురౌతుందని పేర్కొంది. అందుకే కింది కోర్టు విధించిన జైలుశిక్షను రద్దు చేసి రూ.500 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. వాహనం నడిపేప్పుడు ఫోన్ మాట్లాడిన తన మేనల్లుడు ఎంవీ భరద్వాజకి మేజిస్ట్రేట్ నాలుగు రోజుల జైలు శిక్ష విధించడాన్ని కొండాపూర్కు చెందిన పంతంగి రమాకాంత్ హైకోర్టులో సవాల్ చేశారు. భరద్వాజ్ నడిపిన బైక్ను పోలీసులు సీజ్ చేశారని, కోర్టులో జరిమానా చెల్లించి నేరాన్ని అంగీకరించినట్లు ఒప్పుకుంటనేనే తిరిగి వాహనాన్ని ఇస్తామన్నారని, నేరం చేసినట్టుగా నాలుగు రోజులు జైలు శిక్ష విధించడం అన్యాయమని పిటిషనర్ లాయర్ వాదించారు. జిల్లా కోర్టులో అప్పీల్ చేసేలోగా నాలుగు రోజుల శిక్షకాలం పూర్తి అవుతుందని, అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చిందని ఆయన వివరించారు.
ప్రభుత్వ సహాయ న్యాయవాది ప్రతివాదన చేస్తూ నేరాంగీకారం తర్వాతే కింది కోర్టు జైలు శిక్ష విధించిందన్నారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. భరద్వాజ్ ఎలాంటి ప్రమాదం చేయలేదని, రూ.500 జరిమానా విధించి హెచ్చరించి వదిలిపెట్టాలని, కింది కోర్టు ఉత్తర్వులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని, జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలుసునని పేర్కొంది. వెంటనే భరద్వాజ్ను విడుదల చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. అయితే పిటిషనర్ కింది కోర్టు మేజిస్ట్రేట్ను ప్రతివాదిగా చేయడాన్ని డివిజన్ బెంచ్ తప్పుపట్టింది.