Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రాంటు రూపంలో 12,722 కోట్లివ్వండి : 15వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
- ఎత్తిపోతల పథకాల నిర్వహణకు మరో రూ.40,169 కోట్లివ్వాలి
- స్థానిక సంస్థలకు నిధులు పెంచాలంటూ వినతి
- కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించటమే లక్ష్యంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే ఐదేండ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహణకు రూ.10,142 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 2,580 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మొత్తంగా మిషన్ భగీరథ నిర్వహణకు 12,722 కోట్లు కావాలని చెప్పారు.
ఈ మొత్తాన్ని యూజర్ చార్జీల రూపం లో వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కానీ దానికి కొంత సమయం పడుతుందని.. అందువల్ల ఈ కార్యక్రమానికి అవసరమైన రూ.12,722 కోట్లను గ్రాంటు రూపంలో అందించాలంటూ పదిహేనో ఆర్థిక సంఘానికి (ఫైనాన్స్ కమిషన్) ఆయన విజ్ఞప్తి చేశారు.
కోటి 24లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చవుతున్నదని తెలిపారు. రానున్న ఐదేండ్లలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు 40,169 కోట్లు అవసరమవుతాయని.. ఈ మొత్తాన్ని నిర్వహణ వ్యయంగా ఇచ్చేలా ఆర్థిక సంఘం సిఫారసు చేయాలని కోరారు. పదిహేనో ఆర్థిక సంఘం సభ్యులు రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జూబ్లీహాల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్... ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ ఎన్కే సింగ్, సభ్యులు అనూప్ సింగ్, అశోక్ లహిరి, రమేశ్ చంద్ తదితరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎంతోపాటు హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి, సలహాదారు రాజీవ్శర్మ, మంత్రులు ఈటల రాజేం దర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాసగౌడ్, కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు, వాటి నిర్వహణ, నిధుల అవసరం తదితరాంశాల గురించి కమిషన్కు వివరించారు. గతంలో గుజరాత్, కేరళ రాష్ట్రాలు అభివృద్ధికి నమూనాలుగా ఉండేవన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనా అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పారు. 'బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నది. ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అయితే రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నది. రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో కేంద్ర వ్యయం 14 నుంచి 20 శాతానికి పెరిగింది. పెరుగుతున్న ఈ వ్యయానికి బదులు రాష్ట్రాలకు పన్నుల్లో వాటాగా కేంద్రం ఇవ్వొచ్చు. తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాల్లో 50 శాతం ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సమగ్ర అవగాహన అవసరం. వనరుల వినియోగమనేది రాష్ట్రాలకు అనుకూలంగా ఉండేలా విధానాలు రూపొందించాలి. అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకునే పరిపక్వత రాష్ట్రాలకు వచ్చిందన్నది మా అభిప్రాయం. కేంద్రం కంటే రాష్ట్రాల ఆర్థిక విధానాలే బాగుంటున్నాయి. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన, వాటి అమలు తదితరాంశాలను కేంద్రం.. రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుంది. ఆర్థికంగా సొంత పన్నుల ఆదాయం మెరుగ్గా ఉన్న రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. జీఎస్డీపీలో 3 శాతానికి పైగా రుణం తీసుకునే వెసులు బాటు రాష్ట్రాలకు ఉండాలి. జీఎస్డీపీలో ఒకశాతం అదనంగా రుణం తీసుకునే అవకాశం కల్పించాలన్నది మా విజ్ఞప్తి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచాలి. రాష్ట్రంలో పంచాయతీల సంఖ్య 8,368 నుంచి 12,751కి పెరిగింది. పురపాలక సంఘాల సంఖ్య 74 నుంచి 142కు పెరిగింది. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థలకు నిధులు పెంచాలి...' అని ముఖ్యమంత్రి కమిషన్ చైర్మెన్కు విజ్ఞప్తి చేశారు.