Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మందితో మంత్రివర్గ విస్తరణ
- ఎస్టీ, మహిళలకు దక్కనిచోటు
- కీలక శాఖలన్నీ కేసీఆర్ దగ్గరే
- ఇంకా ఆరు ఖాళీలు
- రేపు తొలి భేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విస్తరించారు. కొత్తగా మరో 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. ఇందులో పాతవారితోపాటు కొత్త ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. ఇప్పటికే సీఎంతోపాటు హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మంత్రివర్గం సంఖ్య 12కు చేరినట్టయింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో వారిచేత గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. కాగా ఈ దఫాలో ఎస్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. అలాగే మహిళలకు కూడా చోటు దక్కలేదు. సామాజిక సమీకరణాలు, లోక్సభ ఎన్నికలు, పార్టీలోని పరిస్థితులను అంచనా వేసుకుని సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. విస్తరణలో నలుగురు పాతవారు, మరో ఆరుగురు కొత్త వారున్నారు. అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, జి.జగదీశ్రెడ్డి, ఈటెల రాజేందర్ పాతవారు కాగా, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వి.శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి కొత్తవారు. వీరిలో కొందరు దైవసాక్షిగా, మరికొందరు పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మొత్తం అరగంటలో ముగిసింది.
ఎస్టీ, మహిళకు మొండిచేయి
మంత్రివర్గంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రితోపాటు 12 మంది ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజిక తరగతికి చెందిన వారు ఐదుగురు, వెలమ ఒకరు, ఎస్సీ(మాల) ఒకరు, ముగ్గురు బీసీలకు మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. ఎస్టీ సామాజిక తరగతితోపాటు మహిళలకు చోటుదక్కకపోవడం గమనార్హం. గతంలోనే ఎస్సీలు, మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించని నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా స్థానం లేకపోవడంతో ఆయా సామాజిక తరగతుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది.
1200 మందికి ఆహ్వానాలు
ప్రమాణస్వీకారోత్సవానికి మొత్తం 1200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు. కొత్తగా మంత్రులుగా ఎంపిక చేసినవారికి ఆ విషయాన్ని సీఎం స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. కేటీఆర్ సైతం అందరికీ అభినందనలు తెలియజేశారు. శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబరు 13న సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. తర్వాత 66 రోజులకు విస్తరణ జరిగింది. మంత్రివర్గ కూర్పుపై సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ప్రజాసంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యాలు, సామాజిక సమీకరణాలు, అనుభవం, రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తుది జాబితాను రూపొందించినట్టు సమాచారం.
అట్టహాసంగా మంత్రుల ప్రమాణస్వీకారం
రాజ్భవన్లో తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా ఇంద్రకరణ్రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయగా, ఆ తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్రెడ్డి, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మెన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్రావు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మంత్రులకు శాఖలను సైతం కేటాయించారు. కాగా కీలక శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు. భవిష్యత్తులో చేయాల్సిన రెండో దఫా విస్తరణ దృష్టిలో పెట్టుకుని అలా చేసినట్టు సమాచారం. కాగా తలసాని, ఇంద్రకరణ్రెడ్డిలకు పాత శాఖలనే ఇచ్చారు. జగదీశ్రెడ్డికి గతంలో నిర్వహించిన విద్యాశాఖే మళ్లీ దక్కింది. ఈటలకు వైద్యఆరోగ్య శాఖ ఇవ్వడం గమనార్హం. ప్రశాంత్రెడ్డికి రవాణా, రోడ్లు, భవనాల శాఖ అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి సోమవారం జీవో విడుదల చేశారు.
- ఈటల రాజేందర్ : వైద్య, ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమం
- జగదీష్రెడ్డి : విద్యాశాఖ
- తలసాని శ్రీనివాస్ యాదవ్ : పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ
- ఇంద్రకరణ్రెడ్డి : దేవాదాయ, అటవీ, న్యాయశాఖ
- ప్రశాంత్రెడ్డి : రవాణా, రోడ్లు భవనాల శాఖ, శాసనసభా వ్యవహారాలు, హౌసింగ్
- నిరంజన్రెడ్డి : వ్యవసాయ, సహకార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహరాలు
- కొప్పుల ఈశ్వర్- సంక్షేమం, వికలాంగులు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ
- మల్లారెడ్డి : కార్మిక, ఉపాధి కల్పన, ఫాక్టరీలు, మహిళా శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖ
- శ్రీనివాస్ గౌడ్ : ఎక్సైజ్, టూరిజం, క్రీడలు, పురావస్తు శాఖ
- ఎర్రబెల్లి దయాకర్రావు : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా
బడ్జెట్ ప్రవేశపెట్టేది కేసీఆరే...
మంత్రులకు కేటాయించగా మిగిలిన శాఖలు సీఎం కేసీఆర్ దగ్గరే ఉన్నాయి. ఆర్థికశాఖ, ఇరిగేషన్, ఐటీ, మున్సిపల్ శాఖలు ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకున్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో స్వయంగా సీఎం కేసీఆరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ట్రాఫిక్ జామ్
మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో నేపథ్యంలో నగరంలోని ఖైరతాబాద్-రాజ్భవన్ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రోడ్లపై ఆగిపోయాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ఆలస్యంగా వచ్చారు. దీనికి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడమేనని సమాచారం.
ప్రత్యేక ఏర్పాట్లు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికైన రాజ్భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 1200 మందికి పాసులు జారీకావడంతో, రాజ్భవన్ కొలాహలంగా మారింది. మంత్రులు, వారి కుటుంబాలు విచ్చేశాయి. వేదికపైన గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీనులయ్యారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె.జోషి ఆహ్వానించగా, గవర్నర్ ముఖ్యకార్యదర్శి హర్ప్రీత్సింగ్ సహకరించారు. ప్రమాణ స్వీకార అనంతరం మంత్రులు, వారి కుటుంబాలు, ఆహ్వానితులకు గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు.
రేపు తొలి సమావేశం
రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశం గురువారం ప్రగతిభవన్లో నిర్వహించనున్నారు. ఇందులో ఈనెల 22 నుంచి 25 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ , ఇతర అంశాలపై చర్చించనున్నారు.
క్యాబినేట్లో మహిళకు మళ్లీ అవమానం: ఐద్వా
సీఎం కేసీఆర్ మహిళలకు క్యాబినేట్లో చోటు కల్పించకపోవడం విచారకరమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ ఒక ప్రకటనలో విమర్శించారు. పురుషాధిక్య అహంకారం వల్లే ముఖ్యమంత్రి మహిళలను అవమానపరుస్తున్నారని మండిపడింది. గత క్యాబినేట్లో మహిళకు డిప్యూటీ స్పీకర్ హౌదా అయిన ఉండేదని ఈ సారి అది లేకపోవడం శోచనీయమని అన్నారు. సీఎం ఫ్యూడల్ భావాజాలంతో వ్యవహరిస్తు మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు.