Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈఓ రజత్కుమార్
- రూ.90 లక్షల నగదు..రూ కోటి విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టివేత
- సచివాలయంలోని ప్రమోషన్లపై విచారణ
- 33 జిల్లాలకు డీఈఓల నియామకం
- నాలుగున్నర లక్షల ప్రభుత్వ పోస్టర్ల తొలగింపు
- ''లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంపై నిర్ణయం తీసుకుంటాం''.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికల కోడ్ ఉల్లంఘించే ఏ రాజకీయ పార్టీని కూడా ఉపేక్షించబోమని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ఐ రజత్కుమార్ హెచ్చరించారు. పోటీ చేసే అభ్యర్థులు కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే వేటు తప్పదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ప్రభుత్వ పోస్టర్లను తొలగించామన్నారు. కోడ్ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు 432 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లో ఎన్నికల నియామవళికి విరుద్ధంగా రవాణా చేస్తున్న రూ.90లక్షల నగదు, రూ. కోటి విలువ చేసే 325 గ్రాముల కొకైన్, 1175 గ్రాముల హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో విమర్శలు వచ్చాయని, ఈ సారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా అన్ని జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 432 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు కాగా, అందులో 28 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయని వివరించారు. మిగతా వాటికి ఆధారాలు దొరకడం లేదన్నారు. నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 932 కేసుల్లో 71 కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, మిగతా కేసులపై విచారణ జరుగుతున్నదని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఖర్చుల వివరాలు చెప్పని 62 మందిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించినట్టు తెలియజేశారు.
ప్రత్యేక నిఘా : లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టామని రజత్కుమార్ తెలిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రూ.75 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంటే, 2018లో జరిగిన ఒక్క అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే రూ.122 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కోస్గి మండలంలో రూ.75 కోట్లు స్వాధీనం చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. అక్కడ కేవలం రూ.50లక్షల నగదు మాత్రమే తనిఖీల్లో పట్టుకున్నట్టు వివరించారు.
ప్రమోషన్లపై విచారణ
సచివాలయంలో కొందరు అధికారులకు కల్పించిన ప్రమోషన్లపై విచారణ చేస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి సెక్షన్ 51 ప్రకారం డీపీసీ సమావేశం నిర్వహించుకోవచ్చని, అయితే ఎవరికి ప్రమోషన్లు కల్పించరాదని వెల్లడించారు.
''లక్ష్మిస్ ఎన్టీఆర్'' పై నిర్ణయం
లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయకుండా ఆపాలంటూ తమ కు ఫిర్యాదులు వచ్చాయని సీఈఓ చెప్పారు. అయితే సినిమాల విషయం తమ పరిధిలో ఉండదన్నారు. సినిమాలో అభ్యంతరకర రాజకీయ సన్నివేశాలు ఉంటే మాత్రం కేసు నమోదు చేస్తామని తెలిపారు.