Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనం ఏమైనా కానీ...
- స్వీయలబ్దే శిరోధార్యం
- పిల్లి మొగ్గలేస్తున్న పార్టీలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో రాజకీయం రంజుగా సాగుతోంది...ఎలుక ఏనుగుని మోస్తోంది...నెమలి పాముతో స్నేహం చేస్తోంది. ఇక్కడెక్కడా ప్రకృతి ధర్మంతో కూడిన జాతి వైరం లేదు. నాకేంటి?...అనే ఏకప్రశ్నే అన్నింటికీ సమాధానంగా నిలుస్తోంది. తెలంగాణ పోరాట సమయంలో ఏ దశలోనూ ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ను సమర్ధించింది లేదు. కానీ 2014 ఎన్నికలు అయ్యి, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎంఐఎం చటుక్కున సీఎం కేసీఆర్ పక్కకు దూకేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఆత్మ ఒకటే...శరీరాలే వేర్వేరు అన్నట్టు రెండు పార్టీలు స్వోత్కర్షలతో ఒకరి భుజాలు ఒకరు చరుచుకున్నారు. అదే మైత్రి ఇప్పుడూ కొనసాగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ అధికారిక భాగస్వామి కాదు...అదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే ముందే అమల్లోకి తెచ్చి...శెభాష్ అని సీఎం కేసీఆర్ మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అలాగని కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా సాధించుకొచ్చారా అంటే...అలాంటిదేం లేదని అయనే స్వయంగా చెప్పేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు మొదలు ఉప రాష్ట్రపతి ఎన్నిక, నోట్లరద్దు, జీఎస్టీ, రోడ్డు భద్రతా సవరణ చట్టం అమలు వంటి అనేక కేంద్ర నిర్ణయాల్ని సీఎం కేసీఆర్ స్వాగతించేశారు. అదే సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీతో....నువ్వు కొట్టినట్టు చెయ్యి...నేను ఏడ్చినట్టు చేస్తా...అన్నట్టే వ్యవహరిస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి అదనంగా ఏం ఇవ్వలేదనే రొటీన్ విమర్శ చేస్తూనే... గతంలో కంటే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీపై విమర్శల జోరును తగ్గించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తన దాడిని కాంగ్రెస్పైకే ఎక్కుపెట్టారు...ఇక జనాన్ని నమ్మించాలి కాబట్టి అప్పుడప్పుడు నరేంద్రమోడీపై ఓ సెటైర్ విసురుతూ...రెండు పార్టీలను సమదూరంలో ఉంచామని సంకేతాలు ఇస్తున్నారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ పార్టీని బద్ధ శత్రువుగా పరిగణించి విరుచుకుపడే ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్తో జతకట్టడం రాజకీయ అవసరమే! కేవలం హైదరాబాద్ లోక్సభ ఒక్క స్థానం కోసం ఎంఐఎంపార్టీ మిగిలిన 16 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎంఐఎం తమకు హైదరాబాద్ మినహా మరెక్కడా బలం లేదనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్టు అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహాకూటమి పేరు ఎత్తేందుకే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్లు ధైర్యం చేయట్లేదు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూటమికి కాలం చెల్లినట్టే! కాంగ్రెస్ ఒంటరిగానే 17 లోక్సభ స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించింది. సీపీఐ...సీపీఐ(ఎం)తో కలిసి పోటీచేస్తామని చెప్పింది. ఈ మైత్రికి బహుజన లెఫ్ట్ఫ్రంట్ (బీఎల్ఎఫ్) మద్దతు తెలిపింది. తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాలుగు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా సెటిలర్ల ఓట్లను చీల్చి అంతిమంగా టీఆర్ఎస్కు లబ్ది చేకూర్చడమే ఆ పార్టీ లక్ష్యమనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ ప్రచారం గతంకంటే భిన్నంగా సాగుతోంది. రోజుకో కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్లో చేర్చుకుంటూ మీడియాలో మాస్ క్యాంపెయిన్ విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది. 16 లోక్సభ సీట్లను గెలిపించమని ఓటర్లను అభ్యర్ధిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ స్థానంలో ఎంఐఎంను గెలిపించమని కోరుతున్నారు. అయితే తెరవెనుక సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు తెలిపే అంశాన్ని ఆపార్టీ శ్రేణులు కొట్టేయట్లేదు. ఈ ఒప్పందం ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలోనే జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పాల్గొనే పరిమిత సంఖ్యా స్థానాల ఎన్నికల్లో అన్ని పార్టీలు శక్తిమేరకు బలాబలాల్ని ప్రదర్శిస్తున్నాయి. ఓటర్ల చూపు పార్టీలపైనే తప్ప, వ్యక్తులపై ఉండకుండా జాగ్రత్త పడుతున్నాయి.