Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకు పోటీ నుంచి వైదొలుగుతా.. మీరూ :ఎంపీ కవితకు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి సవాల్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రతినిధి
పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమం నేపథ్యంలో.. నిజామాబాద్ స్థానం నుంచి రైతును పార్లమెంట్కు ఏకగ్రీవంగా పంపేందుకు తాను సిద్ధమని, ఇందుకు టీఆర్ఎస్ ఎంపీ కవిత సిద్దమా అని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ సవాల్ చేశారు. 'ఇద్దరం పోటీ నుంచి వైదొలుగుదాం. పసుపు లేదా ఎర్రజొన్న రైతు ఒకరిని ఏకగ్రీవంగా పంపుదాం. పోటీ నుంచి విరమించుకునేందుకు మీరు సిద్ధమా?' అని ప్రశ్నించారు. మధుయాష్కీ శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో ఎంపీ కవిత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై జరిగిన దాడులపై, చిన్నారులపై లైంగికదాడులపై ఏనాడూ స్పందించలేదని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు పేర రైతులను మోసం చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు సేవ చేసే దొరసాని కావాలో, ప్రజల్ని దొరలుగా గుర్తించి పని చేసే సేవకుడు కావాలో ఆలోచించాలి అని కోరారు.
ఈ ఎన్నికలు దేశ రాజ్యాంగాన్ని, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని, లౌకికవాదాన్ని కాపాడే కీలక ఎన్నిక లని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే.. 'కేసీఆర్ ఫ్రంట్(ముందు).. మోడీ బ్యాక్(వెనుక) ఇదే ఫెడరల్ ఫ్రంట్' అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనన్నారు. నోట్లరద్దు నుంచి అన్ని అంశాల్లో మోడీకి కేసీఆర్ వంతపాడారని విమర్శించారు. దళితుడ్ని ముఖ్య మంత్రి చేస్తానన్న కేసీఆర్.. ప్రస్తుత అసెంబ్లీలో దళిత ప్రతిపక్ష నేత ఉంటే కూడా సహించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదా దక్కనీయకుండా, దళితుడు ప్రశ్నించొద్దు అన్న అహంకారంతో రోజుకో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంపీ కవిత పసుపు బోర్డు, బోధన్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని జిల్లా ప్రజలను, రైతులను మోసం చేశారని అన్నారు. 'ఎంపీ కవిత డబ్బులు ఇచ్చి ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్నారు' అని ఆరోపించారు. 2014లో కవిత ఆస్తులు, 2019లో ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీగా గెలిపిస్తే కవిత సర్వీసు ట్యాక్స్(కేఎస్టీ)ని రద్దు చేస్తానని అన్నారు. ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తామన్న దానిపై తాము జ్యోతిష్యాన్ని నమ్మబోమని అన్నారు. అయితే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మోహన్రెడ్డి, మాజీ డీసీసీ తాహెర్బిన్ హందాన్, సీసీసీ కేశ వేణు, పార్టీ సీనియర్ నాయకులు ఈరవత్రి అనిల్, భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు.