Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి దశ ఉద్యయంలో నాన్న.. మలిదశ ఉద్యమంలో నేను:
- మాజీ ఎంపీ గడ్డం వివేకానంద ఆవేదన
- కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
నవతెలంగాణ-పెద్దపల్లి / కోల్సిటీ
పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తామని హామీనిచ్చి, సన్నిహితంగా ఉంటున్నట్టు నమ్మించి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోసం చేశారని మాజీ ఎంపీ గడ్డం వివేకానంద ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని తన నివాసంలో శనివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొలిదశ తెలంగాణ ఉద్యమంతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ అలయన్స్లో కాకా ముఖ్య భూమిక పోషించి ఉద్యమాన్ని నడిపించారన్నారు. మలిదశ ఉద్యమంలో తాను క్రియాశీలకంగా వ్యవహరించి, తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఎదురించి కాంగ్రెస్ ఎంపీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కొట్లాడమని గుర్తు చేశారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్రెడ్డి తనపై ఐటీ దాడులు చేసినా భయపడలేదన్నారు. తన కుమార్తె పెండ్లికి రెండు రోజులు ముందు తనను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అధికార కాంగ్రెస్ పార్టీని వీడానని, తెలంగాణ ఇచ్చాక సోనియాగాంధీ ఆహ్వానం మేరకు మళ్లీ కాంగ్రెస్లో చేరానని వివరించారు. తెలంగాణ కోసం బాగా కష్టపడ్డారు.. పార్టీలోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తేనే టీఆర్ఎస్లో చేరానని.. అప్పుడు తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం తిరగాలంటే ప్రోటోకాల్ అవసరమని ఆయనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారని చెప్పారు. అయితే ఎంపీ అభ్యర్థుల లిస్ట్లో తన పేరు లేకపోవడంతో ఆ పదవీ అవసరం లేదని రాజీనామా చేశానని తెలిపారు. అప్పటికప్పుడు వచ్చి కండువా కప్పుకున్న నాయకులకు టిక్కెట్టు కేటాయించడం ఆశ్చర్యమేసిందని అన్నారు. తన అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.